వారం రోజులుగా రెక్కీ
పక్కా సమాచారం మేరకు పుడ్డింగ్ పబ్బుపై డెకాయి ఆపరేషన్
మూడు గంటలు సోదాలు
బయట పడ్డ బడాబాబుల మత్తు లీలలు
పూలకుండీలు, బాత్రూం ఫ్లష్లో డ్రగ్స్ పారవేత
10 వాహనాల్లో 30 ట్రిప్పుల్లో ఠాణాకు తరలింపు
జాబితాలో 148 మంది
సిటీబ్యూరో, ఏప్రిల్ 3 : మాదక ద్రవ్యాలకు కేంద్రంగా పబ్బులు మారుతున్నట్లు హైదరాబాద్ పోలీసులకు పక్కా సమాచారం అందింది. రెడ్ హ్యండెడ్గా పట్టుకోవడానికి డెకాయి ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని పబ్బుల్లో జరుగుతున్న చట్ట వ్యతిరేక కార్యకలాపాలను ఉక్కుపాదంతో అణిచివేయాలంటే పక్కా ఆధారాలు సేకరించాలని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ప్రత్యేక ప్రణాళికలు రూపొందించారు. ఆ బాధ్యతను టాస్క్ఫోర్స్ డీసీపీ రాధకిషన్రావు బృందం, హైదరాబాద్ నార్కోటిక్ ఎన్ఫోర్స్మెంట్ వింగ్(హెచ్న్యూ) డీసీపీ చక్రవర్తి గుమ్మి బృందాలకు అప్పగించారు. ఇందులో భాగంగా టాస్క్ఫోర్స్ పోలీసులు బంజారాహిల్స్లోని ర్యాడిసన్ బ్లూ ఫైవ్ స్టార్ హోటల్లో పుడ్డింగ్ మింక్ పబ్బుపై నిఘా పెట్టారు. వారం రోజులుగా ఈ పబ్బుపై టాస్క్ఫోర్స్ పోలీసులు అక్కడ జరుగుతున్న వ్యవహారాలన్నీ స్వయంగా పరిశీలించేందుకు రెక్కీ నిర్వహించారు. పక్కాగా డ్రగ్స్ వాడుతున్నట్లు సమాచారం అందుకొని ఆదివారం తెల్లవారుజామున ఒక్కసారిగా పబ్బుపై డెకాయి ఆపరేషన్ నిర్వహించారు.
దారులన్నీ మూసేశారు.!
వారం మొత్తం అక్కడ జరుగుతున్న వ్యవహారాలను పరిశీలించిన పోలీసులు, వీకెండ్ పార్టీలకు భారీగా యువతీ, యువకులు పబ్బుకు వస్తున్నట్లు గుర్తించారు. శనివారం అర్ధరాత్రి తరువాత పబ్బుకు వచ్చే వారి సంఖ్య పెరిగిపోయింది. దీంతో అప్పటికే టాస్క్ఫోర్స్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. ఏ సమయంలోనైనా పబ్బు లోపల ఉన్న టాస్క్ఫోర్స్ కానిస్టేబుల్స్ నుంచి గ్రీన్ సిగ్నల్ వస్తుందని ఎదురు చూశారు. ఆదివారం తెల్లవారుజామున 2.30 గంటల ప్రాంతంలో టాస్క్ఫోర్స్ బృందాలకు గ్రీన్ సిగ్నల్ రావడంతో 2.45 గంటలకు పబ్బులోకి చేరుకున్నాయి. టాస్క్ఫోర్స్ పోలీసులు పబ్బులోకి వెళ్లగానే పబ్బులో నుంచి బయటకు వెళ్లే దారులన్నింటిని మూసేశారు. డీజేను ఆప్ చేశారు. పోలీసులు వచ్చారంటూ తెలువడంతో అక్కడున్న వారు పరుగులు తీశారు.
సభ్యులుగా చేరి.. కూపీ లాగి..!
ఈ పబ్బులోకి రాజకీయ, వ్యాపార, సినీ వర్గాలకు చెందిన ధనవంతుల పిల్లలు వస్తుంటారు. ఇందులోకి సభ్యత్వం ఉన్న వారినే అనుమతిస్తారు. సభ్వత్వం తీసుకోవాలంటే రోజు పబ్బుకు వచ్చే నమ్మకమైన వాళ్ల రెఫరెన్స్ కావాలి. ఇందుకు టాస్క్ఫోర్స్కు చెందిన ముగ్గురు కానిస్టేబుళ్లు ఆ హోటల్ వద్దకు వెళ్లి అక్కడికొచ్చే వారిని పరిచయం చేసుకున్నారు. వారం రోజుల కిందట సభ్యత్వం తీసుకున్నారు. పది రోజులుగా ఆ ముగ్గురు కానిస్టేబుల్స్ పబ్బుకు వెళ్లి అక్కడ జరుగుతున్న వ్యవహారాలను పరిశీలించారు. ఎన్ని గంటలకు పబ్బులోకి వస్తున్నారు, ఎన్నిగంటలు ఉంటున్నారు, ఎవరెవరు ఏమి చేస్తున్నారనే విషయాలను గమనిస్తూ ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు.
పూలకుండీల్లో డ్రగ్స్ పారవేత..
పోలీసులు వచ్చారనే విషయం తెలియగానే పబ్బులో ఉన్న కొందరు తమ వద్ద ఉన్న కొకైన్, హేరాయిన్, గంజాయి, సిగరేట్లు పడేశారు. కొందరు డ్రగ్స్ ప్యాకెట్లను పూలకుండీలలో పడేస్తే, మరికొందరు వెంటిలేటర్ల నుంచి బయటకు పడేశారు. ఇంకొందరు బాత్రూంలలోకి వెళ్లి పడేసి, ప్లష్ చేశారు. ఎవరు పడేశారు.. ఎక్కడి నుంచి వారు డ్రగ్స్ సేకరించారనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఇందుకు పబ్బులో ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించి వారిని గుర్తించనున్నారు.
3గంటలు తనిఖీలు..
డ్రగ్స్ను ఎవరు పడేశారు అనే విషయాన్ని గుర్తించేందుకు టాస్క్ఫోర్స్, బంజారాహిల్స్ పోలీసులు అందరినీ తనిఖీలు చేశారు. ఇంకా ఎవరివద్దనైనా డ్రగ్స్ ఉన్నాయా అనే వివరాలు సేకరించారు. తనిఖీలు నిర్వహించిన అనంతరం వారిని బంజారాహిల్స్ పోలీస్స్టేషన్కు తరలించారు. పట్టుబడిన యువతను తరలించేందుకు 10 పోలీసు వాహనాల్లో 30 ట్రిప్పులు కొట్టారు.
జాబితాలో 148 మంది
శనివారం అర్ధరాత్రి బంజారాహిల్స్ పోలీస్స్టేషన్ పరిధిలోని ర్యాడిసన్ బ్లూ హోటల్లోని పుడ్డింగ్ అండ్ మింక్ పబ్బుపై టాస్క్ఫోర్స్, స్థానిక పోలీసులతో కలిసి దాడులు నిర్వహించాం. ఈ దాడుల్లో సుమారు 100 మంది మద్యం సేవించినట్లు గుర్తించాం. అదే సమయంలో పబ్బు జనరల్ మేనేజర్ మహదారం అనిల్కుమార్ వద్ద ఐదు గ్రాముల కొకైన్ స్వాధీనం చేసుకున్నాం. పబ్బు నిర్వాహకుడు అభిషేక్ ఉప్పల, మేనేజర్ అనిల్కుమార్ను అరెస్ట్ చేశాం. మరో నిర్వాహకుడు అర్జున్ వీరమాచినేని పరారీలో ఉన్నాడు. అతడి కోసం గాలిస్తున్నాం. సోషల్మీడియాలో 142 మంది ఉన్నట్లు జాబితా సర్క్యులేట్ అవుతుంది, ఆ లిస్ట్ మేం జారీ చేయలేదు. మా లెక్క ప్రకారం మొత్తం 148 మంది జాబితాలో ఉన్నారు. ఇప్పటి వరకు ఎవరి వద్ద నుంచి రక్తపు నమూనాలు సేకరించలేదు. ఈ కేసు బాధ్యతలను జూబ్లీహిల్స్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్రెడ్డికి అప్పగించాం.
– జోయెల్ డేవీస్, వెస్ట్జోన్ డీసీపీ
మత్తులో వింత చేష్టలు
బట్టలు విప్పి.. ఆసనాలు వేస్తూ నృత్యాలు
ఠాణా చుట్టు పక్కల వందలాది కార్లతో ట్రాఫిక్ రద్దీ
బంజారాహిల్స్లోని ర్యాడిసన్ హోటల్లో నిర్వహిస్తున్న పుడ్డింగ్ మింక్ పబ్బులో పట్టుబడ్డ బడాబాబులు మత్తులో చేసిన లీలలు ఒక్కొక్కరివి ఒక్కో రకంగా ఉన్నాయి. మూడు గంటల పాటు పోలీసులకు చుక్కలు చూపించారు. మమ్మల్నే పట్టుకుంటారా? మీకెంత ధైర్యమంటూ పోలీసులపై తిరగబడ్డారు. మేము ఎవరో తెలుస్తా.. అంటూ పోలీసులను ప్రశ్నించారు. కొందరు బట్టలు విప్పి పోలీసుల ముందు వింత చేష్టలు చేశారు. మేం పోలీస్స్టేషన్కు రాం.. మీకు ఏమి కావాలో చెప్పండంటూ ఇష్టాను సారంగా మాట్లాడారు. పోలీసులు మాత్రం ఎవరు ఎంత రెచ్చగొట్టినా సంయమనం పాటిస్తూ వాళ్ల చేష్టలన్నింటిని సెల్ఫోన్లో రికార్డు చేశారు. ఒక యువకుడిని ఠాణాకు తరలిస్తుండగా బట్టలు విప్పేసి నగ్నంగా నృత్యం కూడా చేశాడు. అతడి చేష్టలతో పోలీసులు విస్తుపోయారు. మరో యువకుడు తాను బండి ఎక్కనంటూ కాళ్లు కిందకు చేతులుపైకి లేపి ఆసనాలు వేశాడు. నిండుగా మత్తులో మునిగిపోయిన చాలా మంది యువత, పోలీస్స్టేషన్కు వచ్చిన తరువాత కూడా మత్తులోనే ఉండిపోయారు. తమ పిల్లలను పోలీస్స్టేషన్కు తీసికెళ్లారని తెలుసుకున్న వారి తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు, న్యాయవాదులతో బంజారాహిల్స్ పోలీస్ష్టేషన్ పరిసరాలన్ని కార్లతో నిండిపోయాయి. ఆదివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రోడ్డంతా రద్దీగా మారింది. ఉదయం 7 గంటల వరకు పోలీస్స్టేషన్ ముందున్న రోడ్డులో ఐదు వందలకుపైగా కార్లు పార్కు చేసి ఉన్నాయి.