సికింద్రాబాద్, జూన్ 16: కాపీ రైట్స్ నిబంధనలకు విరుద్ధంగా నకిలీ సామగ్రి క్రయ విక్రయాలను కొనసాగిస్తున్న నలుగురు వ్యాపారులపై బోయిన్పల్లి పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్సై యుగంధర్ తెలిపిన వివరాల ప్రకారం ఓల్డ్ బోయిన్పల్లికి చెందిన షేక్ షానవాజ్ అహ్మద్(25) బోయిన్పల్లి చెక్పోస్టు సమీపంలో ఎస్కేఎస్ ఆటోమొబైల్స్, ముషీరాబాద్ రాంనగర్కు చెందిన శ్రీనివాసులు (54) ఓల్డ్ బోయిన్పల్లి అలీ కాంప్లెక్స్లో శ్రీ శ్రీనివాస ఆటోమొబైల్స్ పేర్లతో వ్యాపారాలను కొనసాగిస్తున్నారు. షాన్వాజ్ అహ్మద్ తిరుమలగిరికి చెందిన యువకుడు (17) వద్ద, శ్రీనివాసులు చిక్కడపల్లికి చెందిన అంకిత్(29) నుంచి టాటా ఏస్ వాహనానికి సంబంధించిన నకిలీ ఆయిల్ సీల్లను కొనుగోలు చేస్తున్నారు.
కాపీ రైట్స్ నిబంధనలకు విరుద్ధంగా స్వయంగా టాటా మోటర్స్ కంపెనీ తయారు చేసినవేనంటూ.. వినియోగదారులకు విక్రయిస్తున్నారు. అలా చేయడంవల్ల అటు సంస్థకు పెద్దమొత్తంలో నష్టాలు వాటిల్లడమే కాకుండా అమాయకులు మోసపోతున్నారని, నిందితులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈఐపీఆర్ ప్రైవేటు లిమిటెడ్ సీనియర్ ఆపరేషన్స్ మేనేజర్ విజయకుమార్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.