సిటీబ్యూరో, నవంబర్ 8 (నమస్తే తెలంగాణ)/శంషాబాద్ రూరల్: నకిలీ నోట్లు తయారు చేస్తున్న ముఠా గుట్టను సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు రట్టు చేశారు. ఈ ముఠాకు చెందిన ఇద్దరిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.2.9 లక్షల నకిలీ నోట్ల(రూ.100, 500)తో పాటు మొత్తం రూ.7లక్షల విలువజేసే సొత్తును స్వాధీనం చేసుకున్నారు. శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ సత్యనారాయణగౌడ్ కథనం ప్రకారం.. ఏపీలోని నర్సారావుపేట జిల్లాకు చెందిన వెంకటేశ్వర్లు ఉపాధి కోసం కొన్నిరోజుల కిందట నగరానికి వలసొచ్చాడు. సాగర్ రింగ్రోడ్లోని అలేఖ్య టవర్స్ వద్ద నివాసముంటూ, సివిల్ కాంట్రాక్టర్గా పనిచేస్తున్నాడు. వ్యసనాలకు అలవాటుపడిన వెంకటేశ్వర్లు ఎలాగైనా సులభంగా డబ్బు సంపాదించాలని పథకం వేశాడు.
ఏకంగా నకిలీ నోట్లనే తయారు చేసి చలామణి చేయాలని నిర్ణయం తీసుకున్నాడు. తన అనుచరుడైన ఏపీకి చెందిన శ్రీనివాస్తో కలిసి శంషాబాద్లోని బాలయేసు కాలనీలో ఒక అద్దె ఇంటిలో నకిలీ నోట్లను తయారు చేయడం మొదలుపెట్టాడు. తయారు చేసిన నకిలీ నోట్లను 1.3 నిష్పత్తిలో ఇతరులకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇన్స్టాగ్రామ్, టెలీగ్రామ్ వంటి సోషల్ మీడియా ద్వారా నకిలీ కరెన్సీ చలామణి ఏజెంట్లను సంప్రదిస్తున్నారు. నకిలీ నోట్లను ఈ ఏజెంట్లు రాత్రి సమయంలో రద్దీగా ఉండే మార్కెట్లు, వీధి వ్యాపార కేంద్రాలు, పండ్ల మార్కెట్లు, కిరాణా దుకాణాలు, రైతు బజార్లలో అసలైన నోట్ల మధ్య పెట్టి చలామణి చేస్తూ అమాయక ప్రజలను మోసగిస్తున్నారు.
ప్రస్తుతం ఎన్నికల సమయం కావడంతో ఈ ముఠా పెద్ద ఎత్తున నకిలీ నోట్లను చలామణి చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ మేరకు సమాచారం అందుకున్న శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు సైబరాబాద్ పోలీసు కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర, శంషాబాద్ డీసీపీ కె.నారాయణరెడ్డి, ఎస్ఓటీ డీసీపీ ఎంఎ.రషీ పర్యవేక్షణలో శంషాబాద్ ఎస్ఓటీ ఇన్స్పెక్టర్ బి.సత్యనారాయణగౌడ్ తన బృందంతో కలిసి నకిలీ నోట్ల తయారీ కేంద్రంపై దాడులు జరిపారు. ఈ దాడుల్లో ఇద్దరు నిందితులతో పాటు రూ.2.9లక్షల నకిలీ కరెన్సీ(రూ.100, 500నోట్లు) సహా మొత్తం రూ.7లక్షల విలువజేసే ప్రింటర్లు, నకిలీ కరెన్సీ తయారీకి వినియోగించే సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. తదుపరి విచారణ నిమిత్తం కేసును ఆర్జీఐ పోలీసులకు అప్పగించారు. ఈ సందర్భంగా నకిలీ నోట్ల ముఠా గుట్టును రట్టు చేసిన శంషాబాద్ ఎస్ఓటీ, ఆర్జీఐ పోలీసులను పోలీసు కమిషనర్ అభినందించారు.