పహాడీషరీఫ్, ఫిబ్రవరి 26 : బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలో ఇటీవల అదృశ్యమైన ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడి ఫోన్లో ఓ వ్యక్తి మరో సిమ్ వేసి వాడుతున్న క్రమంలో హత్య కోణం బయటపడింది. పహాడీషరీఫ్ పోలీస్స్టేషన్ కార్యాలయంలో మహేశ్వరం జోన్ ఏసీపీ అంజయ్య, బాలాపూర్ సీఐ భాస్కర్తో కలిసి ఆదివారం వివరాలు వెల్లడించారు.
బాలాపూర్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఉస్మాన్నగర్లో నివాసం ఉంటున్న మహ్మద్ షా ఫైసల్(25) మదీనా సెంటర్లో వస్త్ర దుకాణంలో పని చేస్తుంటాడు. ఈ నెల 12న రాత్రి 8 గంటలకు ఉస్మానియా హోటల్ వద్దకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి అవుతున్నా రాకపోయేసరికి తండ్రి జాఫర్ కుమారుడికి ఫోన్ చేయగా స్విచ్ఛాఫ్ అని వచ్చింది. పలు చోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో 15న బాలాపూర్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. 25న సీడీఆర్ డేటాను పరిశీలించగా, అదృశ్యమైన వ్యక్తి మొబైల్ ఫోన్ను చాంద్రాయణగుట్టలోని సయ్యద్ షాహీద్ వాడుతున్నట్లు గుర్తించారు. విచారణలో మినార్కాలనీకి చెందిన వాజహత్ అలీ నుంచి కొనుగోలు చేశానని తెలిపాడు. వాజహత్ అలీని విచారించగా మినార్ కాలనీ కే చెందిన అబ్దుల్ జబ్బార్ వద్ద కొనుగోలు చేసినట్లు తెలుపడంతో నిందితుడు జబ్బార్ అని నిర్ధారణకు వచ్చి అతడిని అరెస్టు చేశారు. విచారణలో తానే తన స్నేహితుడిని హత్య చేసినట్లు తెలిపాడు.
13 రోజుల అనంతరం వెలుగులోకి…
నిందితుడు అబ్దుల్ జబ్బార్ (22) కాస్మొటిక్ స్ట్రీట్ వెండర్, మహ్మద్ షా ఫైసల్ ఇద్దరూ స్నేహితులు. 12న రాత్రి 8 గంటల సమయంలో మినార్కాలనీలోని స్నేహితుడి ఇంటి వద్దకు వెళ్లాడు. అతను ఇంటి సమీపంలోని నిర్మానుష్య ప్రాంతంలో మద్యం సేవిస్తున్నాడు. జబ్బార్ను బయటకు వెళ్దామని ఫైసల్ కోరాడు. నిరాకరించడంతో అసభ్య పదజాలంతో మాట్లాడాడు. దీంతో జబ్బార్ కర్రతో తలపై బలంగా కొట్టగా ఫైసల్ అపస్మారకస్థితిలోకి వెళ్లాడు. వెంటనే పక్కనే ఉన్న బండరాయితో తలపై విచక్షణారహితంగా బాది హత్య చేశాడు. అనంతరం మృతదేహాన్ని రాళ ్లమధ్య పడేసి చిరిగిన సిమెంట్ బస్తాలతో, చెత్తతో కప్పి పెట్టాడు. ఆపై దుర్వాసన రాకుండా రసాయానాలు చల్లాడు. అతని మొబైల్ ఫోన్ను తీసుకుని వెళ్లాడు. పోలీసులు మృతదేహాన్ని ఉస్మానియా మార్చురీకి తరలించారు. మొబైల్ ఫోన్ను స్వాదీనం చేసుకుని నిందితుడిని రిమాండ్కు తరలించారు.