బొల్లారం, జూన్ 20: తిరుమలగిరి మిలిటరీ కాలేజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ మెకానికల్(ఎంసీఈఎంఈ) సెంటర్లోకి అక్రమంగా నలుగురు ప్రవేశించిన సంఘటన శుక్రవారం తిరుమలగిరి పోలీస్స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన ప్రకారం.. తిరుమలగిరిలోని ఎంసీఈఎంఈలో అక్రమంగా ఇద్దరు మహిళలు బుర్ఖా ధరించి.. ఇద్దరు పురుషులు అక్రమంగా ప్రవేశించి వీడియోలు తీస్తున్నారు.
అక్కడే విధులు నిర్వహిస్తున్న జవాన్లు ఫొటోలు, వీడియోలు తీయడం నిషేధమని వారిని అడ్డుకున్నారు. కాగా, నిందితులు ‘మేము ఆర్మీ జవాన్లమే’ అంటూ ఐడీ కార్డులు చూపించారు. దీంతో స్థానిక జవాన్లు వారు ఐడీ కార్డులను పరిశీలించి ఆర్మీ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. వారి ఐడీ కార్డులను పరిశీలించిన అధికారులు అవి నకిలీ ఐడీ కార్డులు అని గుర్తించి వెంటనే తిరుమలగిరి పోలీసులకు సమాచారం అందించారు. ఆర్మీ సెంటర్లోకి నకిలీ ఐడీ కార్డులతో ప్రవేశించిన వారు ఎక్కడి నుంచి వచ్చారని పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.