చార్మినార్, ఏప్రిల్ 9 : ఆర్థిక సమస్యలు సృష్టిస్తూ పాతనగరంలో అక్రమంగా కొనసాగుతున్న సట్టా కేంద్రంపై శనివారం దక్షిణ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. టాస్క్ఫోర్స్ అదనపు డీసీపీ చక్రవర్తి గుమ్మీ తెలిపిన వివరాల ప్రకారం.. సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన మహ్మద్ ఒమర్, మహ్మద్ ఆమేర్లు సోదరులు. రోజువారీగా చేస్తున్న పనులతో కుటుంబ పోషణ భారంగా మారింది. దీంతో అడ్డదారుల్లోనైనా పనిచేస్తూ అధిక మొత్తాలను సంపాదించాలని ప్లాన్ వేసుకున్నారు. మహారాష్ట్ర కేంద్రంగా సట్టా నిర్వహిస్తున్న మేరాజ్తో సంప్రదింపులు జరిపిన సోదరులు పాతనగరంలో సట్టా నిర్వహించేందుకు ఒప్పందం చేసుకున్నారు. ఆన్లైన్ ద్వారా జరిగే ఈ సట్టా ఆటలో పందెం కాసే వారిని ఎంచుకోవడానికి ఒమర్, ఆమేర్(27)తోపాటు నాసీర్ అహ్మద్ (40), మహ్మద్ రెహాన్(61)లను స్థానికంగా ఏజెంట్లుగా నియమించుకున్నారు.
నిందితులు ఆటో డ్రైవర్లు, పాన్షాపు నిర్వాహకులు, కూరగాయల వ్యాపారులను ఈ మొగ్గులోకి దింపుతూ సమయంలో అధిక మొత్తాలు అందుతాయంటూ వారిలో ఆశలు కల్పించి సట్టా ఆటలో పందెం కాసేలా ఒప్పించే వారు. వారి వద్ద నుంచి నగదును వసూళ్లు చేస్తూ వాటిని మహారాష్ట్రలోని మేరాజ్కు ఆన్లైన్ ద్వారా చేరవేస్తుంటారు. మేరాజ్ నుంచి అధిక మొత్తాలతో కమీషన్లు అందుకుంటున్న నిందితులు విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. పందెం కాసినవారు ఆర్థిక సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. నిందితుల వ్యవహారంపై విశ్వసనీయ సమాచారం అందుకున్న దక్షిణ మండల టాస్క్ఫోర్స్ అధికారులు నిందితుల నివాసాలపై దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ముగ్గురు నిందితులు పట్టుబడగా.. ప్రధాన నిందితుడు మేరాజ్తోపాటు ఆమేర్, బబా, ఫక్షి, మౌలా, సమద్ పరారీలో ఉన్నారని తెలిపారు. నిందితుల వద్ద నుంచి రూ.27,200 నగదుతోపాటు మూడు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.