సిటీబ్యూరో, సెప్టెంబర్ 28 (నమస్తే తెలంగాణ): నగరంలో ప్రశాంత వాతావరణంలో గణేశ్ నిమజ్జన శోభాయాత్ర అంగరంగ వైభవంగా సాగింది. పోలీసుల వ్యూహం ఫలించింది. అనుకున్న సమయానికి కీలకమైన ఖైరతాబాద్ గణేనాథుడిని మధ్యాహ్నం ఒకటిన్నరకు, బాలాపూర్ గణేశుడిని 4.30 గంటలకు నిమజ్జనం పూర్తి చేశారు. మండప నిర్వాహకులతో సమన్వయం చేసుకుంటూ, భక్తులకు ఇబ్బందులు రాకుండా పోలీసు యంత్రాంగం పటిష్ట చర్యలు తీసుకున్నది. ఈ సారి ఎన్నికల నేపథ్యంలో బదిలీలపై కొత్త అధికారులు ఎక్కువగా నగరానికి వచ్చారు. దీంతో పోలీస్ కమిషనర్లు ఈ విషయాన్ని మరింత అప్రమత్తంగా ఉండేలా సిబ్బందిని సిద్ధం చేశారు. మొదటిసారిగా అటూ ఖైరతాబాద్, ఇటూ బాలాపూర్ గణనాథులను వేగంగా నిమజ్జనం చేయడంతో భక్తులు చర్చించుకుంటున్నారు. ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా 40 వేల మందితో అడుగడుగున పోలీసు బందోబస్తును ఏర్పాటు చేయడమే కాకుండా, లక్షలాది సీసీ కెమెరాలతో నిరంతరం వీక్షించారు. బాలాపూర్ నుంచి హుస్సేన్సాగర్ వరకు జరిగే ప్రధాన శోభాయాత్ర రూట్లో ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాచకొండ పోలీస్ కమిషనర్ డీఎస్ చౌహాన్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర నిమజ్జనం జరుగుతున్న తీరును స్వయంగా పరిశీలించారు.
నిమజ్జన కార్యక్రమాన్ని ఆయా కమిషనరేట్ పోలీస్ కమిషనర్లు కమాండ్ కంట్రోల్ నుంచి వీక్షించారు. కాగా బంజారాహిల్స్లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)లోని మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ సెంటర్ నుంచి అన్ని ప్రభుత్వం విభాగాలు సమన్వయంతో క్షేత్ర స్థాయిలో జరుగుతున్న నిమజ్జన కార్యక్రమాన్ని సీసీ కెమెరాల ద్వారా వీక్షించారు. శోభాయాత్రలో ఎక్కడైన వాహనాలు ఆగిపోతే వెంటనే రూట్ క్లియర్ చేసేందుకు క్రేన్లను అందుబాటులో ఉంచారు.వెహికల్ మౌంటెడ్ కెమెరాలను ఉపయోగించి ఎక్కడ ఇబ్బందులు కలుగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు.
ఒక పక్క నిమజ్జనం కార్యక్రమం మధ్యాహ్నం తరువాత ఊపందుకుంటుండగా, మరో పక్క ఒక్కసారిగా భారీ వర్షం కురిసింది. వర్షంలోనే శోభాయాత్ర కొనసాగింది, భక్తులు సందడి చేశారు. పోలీసులు ఎవరిని కూడా తొందర పెట్టలేదు. ప్రధానమైన గణేశుల నిమజ్జన కార్యక్రమాన్ని పోలీసులు అనుకున్న సమయానికి పూర్తి చేశారు.
నిమజ్జనోత్సవంలో భక్తులతో పాటు ఈ సారి పోలీసులు కూడా కొద్దిసేపు సందడి చేయడంతో భక్తుల్లో ఉత్సాహం పెరిగింది. ఖైరతాబాద్ గణేశుడు నిమజ్జనానికి తరలిస్తున్న క్రమంలో భక్తులతో కలిసి నృత్యాలు చేశారు. పోలీసులు చేసిన నృత్యాలతో భక్తులు కేరింతలు కొడుతూ ఉత్సాహంగా ముందు కు కదిలారు. డీసీపీ స్థాయి అధికారుల నుంచి కానిస్టేబుల్ వరకు కొద్దిసేపు ఉల్లాసంగా నృత్యాలు చేస్తూ అందరిలో జోష్ నింపారు. ఈ దృశ్యాలు సోషల్మీడియాలో వైరల్ అయ్యాయి.
మల్టీ ఏజెన్సీ ఆపరేషన్ కేంద్రాన్ని రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, డీజీపీ అంజనీకుమార్, నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సందర్శించారు. ఏరియల్ సర్వే పూర్తి చేసిన అనంతరం బేగంపేట్ ఎయిర్పోర్టు నుంచి నేరుగా బంజారాహిల్స్లోని కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్కు చేరుకున్నారు. గంటన్నరకుపైగా కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్(సీసీసీ)లో మల్టీ ఏజెన్సీ ఆపరేటింగ్ సెంటర్ నుంచి నిమజ్జనం కార్యక్రమాన్ని వీక్షించారు. బాలాపూర్ వినాయకుడు నిమజ్జనం జరుగుతుండగా ఉన్నతాధికారులు అక్కడి నుంచే పర్యవేక్షించారు.