సాహితీ సప్తాహంలో దాశరథి తనయకు సన్మానం
సిటీబ్యూరో, జూలై 22 (నమస్తే తెలంగాణ) : ‘నమస్తే తెలంగాణ’ ఆధ్వర్యంలో ‘నా తెలంగాణ ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం’ కార్యక్రమాన్ని శుక్రవారం ఉదయం 11గంటలకు రవీంద్రభారతి మినీహాల్లో వైభవంగా నిర్వహించారు. ‘కవిత-పద్యం, పాటల పోటీల విజేతలకు నగదు పురస్కారంతోపాటు బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా దాశరథి కృష్ణమాచార్య తనయ దాశరథి ఇందిరా గౌరీశంకర్ దంపతులను ఘనంగా సన్మానించారు. అభినందన కార్యక్రమంలో ప్రజా వాగ్గేయకారుడు, ఎమ్మెల్సీ గోరటి వెంకన్న, నమస్తే తెలంగాణ ఎడిటర్ తిగుళ్ల కృష్ణమూర్తి, వైస్ ప్రెసిడెంట్ చిరంజీవి, తెలంగాణ సాహిత్య అకాడమి చైర్మన్ జూలూరు గౌరీశంకర్, భాషా సాంస్కృతిక సంచాలకుడు మామిడి హరికృష్ణ, ప్రముఖ రచయిత్రి ముదిగంటి సుజాతారెడ్డి, అధికార భాషా సంఘం అధ్యక్షురాలు మంత్రి శ్రీదేవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సాహితీవేత్తలు మాట్లాడుతూ ‘నమస్తే తెలంగాణ’ తమకు అవకాశం ఇచ్చి ప్రోత్సహించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. గతంలో ఏ పత్రిక కూడా కవులను, రచయితలను ఇంత గొప్పగా సన్మానించలేదని చెప్పారు. ‘నమస్తే తెలంగాణ’ యాజమాన్యానికి, సీఎం కేసీఆర్కు రుణపడి ఉంటామని అన్నారు. బహుమతులు అందుకున్న కొంతమంది అభిప్రాయాలు వారి మాటల్లోనే..
ఇప్పటి వరకు ఏ పత్రికలూ సన్మానించిన దాఖలాలు లేవు..
పద్య విభాగంలో ప్రథమ బహుమతి అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టే ఈరోజు కవులు, రచయితలు ఆత్మగౌరవంతో బతుకగలుగుతున్నా రు. నమస్తే తెలంగాణ కవిత్వం, పద్యం, పాటల విభాగాల్లో పోటీలు నిర్వహించడం గొప్ప విషయం. మేమంతా అవకాశాన్ని వినియోగించుకున్నాం. తెలంగాణ వస్తే ఏమొస్తదని సీఎం కేసీఆర్ను ఆనాడు తెలంగాణ కోసం ఉద్యమిస్తున్న సమయంలో చాలా మంది అడిగేవారు.. తెలంగాణ వస్తే ఇలా మేము గర్వంగా ఉండగలం అని నిరూపించి చూపిస్తున్నాం. మన భాషను మనం కాపాడుకోగలం. గతంలో ఏ పత్రిక కూడా కవులను, రచయితలను సన్మానించిన దాఖలాలు లేవు. మమ్మల్ని ప్రోత్సహించిన నమస్తే తెలంగాణకు కృతజ్ఞతలు. – బండకాడి అంజయ్య, ప్రథమ బహుమతి విజేత (సిద్ధిపేట)
ఇది మంచి పరిణామం..
కవిత్వంలో పోటీలు నిర్వహించి కొత్త సాంప్రదాయానికి నమస్తే తెలంగాణ పత్రిక శ్రీకారం చుట్టింది. ఇది మంచి పరిణామం. వచన కవిత్వానికి పురస్కారం అందుకోవడం జరిగింది. నా తెలంగాణ.. ప్రగతి ప్రస్థానం.. సాహితీ సప్తాహం శీర్షిక చాలా బాగుంది. కవితలు- పద్యం, సాహిత్యం ప్రక్రియలను ప్రోత్సహిస్తూ విజేతలకు బహుమతులు అందజేయడం చాలా ఆనందంగా ఉన్నది. – రామాచంద్రమౌళి, ప్రముఖ సాహితీవేత్త
తెలంగాణ మట్టిలోనే సాహితీశక్తి..
వేలాది కవిత్వాల్లో నా కవిత ద్వితీయ బహుమతి గెలుచుకోవడం చాలా సంతోషంగా ఉంది. నమస్తే తెలంగాణకు రుణపడి ఉంటాను. ఇంత గొప్పగా సన్మానించి మాకు కవిత్వం పట్ల మరింత ఆసక్తి పెరిగేలా చేయూతనిచ్చారు. అందరిలో సాహితీ స్ఫూర్తిని రగిలించారు. నా తెలంగాణ కోటి రతనాల వీణ అన్నట్టుగానే నా తెలంగాణ కోటి రచనలకు వేదిక. ఇక్కడి మట్టిలోనే సాహితీశక్తి ఉంది. ఇక్కడ వీచేవి సాహితీపరిమళాలు. మాలాంటి కవులకు పత్రికలో చోటిచ్చి మా రచనలకు గుర్తింపునిచ్చి ప్రోత్సహించినందుకు అందరికీ కృతజ్ఞతలు. – దాసరి మోహన్, ద్వితీయ బహుమతి విజేత, హైదరాబాద్
గౌరవం ఇనుమడింపజేయడం ఆనందంగా ఉంది..
తెలంగాణ కవుల గౌరవం ఇనుమడింపజేసేలా నమస్తే తెలంగాణ పత్రిక మంచి కార్యక్రమాన్ని చేపట్టి కవులకు సముచిత స్థానం కలిపించింది. సాంకేతికత పెరిగి సాహిత్యసృజనకు దూరమవుతున్న యువతకు ఈ కార్యక్రమం మార్గదర్శకంగా నిలిచింది. పాటకు గాను సత్కారం జరిగింది. భవిష్యత్లో మంచి రచనలు రావడానికి ఈ వేదిక దోహదపడుతుంది. – అల్లి మోహన్రాజ్. ప్రముఖ రచయిత. కామారెడ్డి
నమస్తే తెలంగాణకు ప్రత్యేక కృతజ్ఞతలు..
మరుగునపడిన సాహిత్యాన్ని వెలికితీసి ప్రపంచానికి చాటిచెప్పే బాధ్యతను నమస్తే తెలంగాణ పత్రిక తీసుకోవడం మంచి పరిణామం. నేటి ఈ కార్యక్రమం ఇతర కవులకు స్ఫూర్తిని కలిగించేలా ఆద్యంతం కొనసాగింది. పాటకు గాను సత్కారం జరిగింది. తెలంగాణ సాహిత్యంతో ప్రజల్లో దేశభక్తిని రగిలించింది. నా తెలంగాణ కోటి రతనాల వీణ అని వర్ణించిన దాశరథి జయంతి రోజునే ఈ కార్యక్రమం నిర్వహించి సాహితీవేత్తలను సన్మానించడం జీవితంలో మరిచిపోలేని సంఘటన. – వాణీ దేవులపల్లి, రచయిత్రి, వరంగల్