సిటీబ్యూరో, ఆగస్టు 14(నమస్తే తెలంగాణ) : పసిప్రాయంలోనే కొందరు చిన్నారులు న్యూమోనియా, ఊపిరితిత్తుల సమస్యలతో సతమతమవుతుంటారు. న్యూమోకొకల్ టీకాతో ఈ సమస్యలను అధిగమించొచ్చు. ఇప్పటివరకు ప్రైవేటు దవాఖానల్లో లభ్యమయ్యే ఈ టీకాలను ప్రభుత్వ దవాఖానలు, పట్టణ, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో వేయనున్నారు. శిశు మరణాలను తగ్గించేందుకు ప్రభుత్వం ఈ టీకాలను ఉచితంగా ఇవ్వాలని నిర్ణయించింది. ఈనెల 18న నగరంలో లాంఛనంగా ప్రారంభం కానుండగా, 21వ తేదీ నుంచి గ్రేటర్వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా న్యూమోకొకల్ టీకాలు వేయనున్నట్లు హైదరాబాద్ జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ వెంకటి తెలిపారు. ప్రైవేటు దవాఖానల్లో ఒక్కో డోసుకు రూ.4 వేల చొప్పున మూడు డోసులకు రూ.12 వేలు ఖర్చవుతుందని, ప్రభుత్వ కేంద్రాల్లో ఉచితంగా పొందవచ్చని చెప్పారు. ఖరీదైనది కావడంతో నిరుపేదలు, మధ్యతరగతి వారు టీకాకు దూరంగా ఉండేవారని, ఇకనుంచి రెగ్యులర్ టీకాలతోపాటు దీన్ని పొందవచ్చని తెలిపారు.
సిటీబ్యూరో, ఆగస్టు 14 (నమస్తే తెలంగాణ) : కొవిడ్ నియంత్రణకు ప్రభుత్వం ఓ వైపు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటూనే మరోవైపు టీకాల ప్రక్రియను వేగవంతం చేసింది. ఇప్పటికే ప్రత్యేక సెంటర్ల ద్వారా టీకాలు వేస్తుండగా, బస్తీల్లో సంచార వాహనాల ద్వారా వ్యాక్సిన్ ఇస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల వైద్యారోగ్య శాఖ ఆధ్వర్యంలో గ్రేటర్ పరిధిలో 40 మొబైల్ బృందాల ద్వారా వ్యాక్సినేషన్ కొనసాగిస్తున్నారు. నిత్యం 14వేల మందికి టీకాలివ్వాలనే లక్ష్యం కాగా, ఐదురోజుల్లో దాదాపు 40వేల మందికి వ్యాక్సిన్ ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.