మోదీ ఒట్టి చేతులతో పంపించారు
దళితబంధు పథకం దేశానికే ఆదర్శం
మంత్రి తలసాని శ్రీనివాస్
బేగంపేట, జూన్ 8: దళితులు ఆర్థికంగా అభివృద్ధి సాధించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం దళితబంధు పథకాన్ని ప్రారంభించిందని పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గానికి చెందిన 28 మంది లబ్ధిదారులకు బుధవారం వెస్ట్మారేడుపల్లిలోని మల్టీపర్పస్ ఫంక్షన్హాల్లో కలెక్టర్ శర్మన్తో మంత్రి వాహనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆర్థికంగా వెనుకబడిన దళితులు అభివృద్ధి సాధించాలనేది సీఎం కేసీఆర్ సంకల్పమన్నారు. దేశంలో ఎక్కడాలేని విధంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారని, ఒక్కో లబ్ధిదారుడికి రూ.10 లక్షల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తుంటే..కేంద్రం నుంచి ఒక్క పైసా తీసుకరావడం చేతకాని బీజేపీ నేతలు ఇష్టానుసారం మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ కార్పొరేటర్లను ఢిల్లీకి పిలిపించుకొని ప్రధాని ఒట్టి చేతులతో తిరిగి పంపించారని, నగరాభివృద్ధి కోసం నిధులు మంజూరు చేసుంటే ప్రజలకు మేలు జరిగేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ కార్పొరేషన్ జిల్లా అధికారి రమేశ్, కార్పొరేటర్లు మహేశ్వరి, కొలను లక్ష్మీ, హేమలత, మాజీ కార్పొరేటర్ అత్తెలి అరుణగౌడ్, సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ శ్రీనివాస్రెడ్డి, డీసీ ముకుందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మరో 10 మందికి ఉపాధి కల్పించాలి
గోల్నాక, జూన్ 8: దళితబంధు పథకం లబ్ధిదారులు రూ.10 లక్షల ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకొని మరో 10 మందికి ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలని అంబర్పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సూచించారు. బుధవారం అంబర్పేట మున్సిపల్ మైదానంలో 26 మంది దళితబంధు పథకం లబ్ధిదారులకు కార్లు,ఆటోట్రాలీలు అందజేశారు. రూ.10 లక్షలతో ఒకే యూనిట్ కాకుండా, రెండు,మూడు యూనిట్లు కూడా ఎంపిక చేసుకోవచ్చని కలెక్టర్ శర్మన్ తెలిపారు.