ఎమ్మెల్యే కృష్ణారావు
కేపీహెచ్బీ కాలనీ, మే 29 : నిరుపయోగంగా ఉన్న ఖాళీ స్థలాలను ఆహ్లాదకరమైన పార్కులుగా తీర్చిదిద్దడం జరుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ డివిజన్ వసంతనగర్ కాలనీలో వసంతవనం పార్కులో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్రావు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ఎనిమిదేండ్ల టీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించిందన్నారు. దీనిలో భాగంగా కూకట్పల్లి నియోజకవర్గంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యతనిస్తూ ఆదర్శవంతంగా అభివృద్ధి పనులు జరిగాయన్నారు. కాలనీలు, బస్తీల్లో అభివృద్ధికి నోచుకోని ఖాళీ స్థలాలను పార్కులుగా, క్రీడా ప్రాంగణాలుగా అభివృద్ధి చేసినట్లు తెలిపారు. వసంతనగర్ కాలనీలోని పార్కులో రూ.2 కోట్లతో అభివృద్ధి పనులు జరిగాయన్నారు. ఓపెన్ జిమ్, యాంపీ థియేటర్, యోగా సెంటర్ నిర్మాణ పనులు జరిగాయని.. మిగిలిన పనులను పూర్తి చేసేందుకు మరో కోటి రూపాయల నిధులను కేటాయించినట్లు తెలిపారు. పార్కులో పిల్లలు యువకులు ఆడుకునేలా, వృద్ధులు, మహిళలు సేదతీరేలా సకల వసతులు కల్పించనున్నట్లు తెలిపారు. ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న పార్కులను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు.
60 ఫీట్ల రోడ్డు యథాతథం..
ముంబై జాతీయ రహదారి నుంచి గోకుల్ ప్లాట్స్ వరకు వసంతనగర్ రోడ్డును 60 ఫీట్ల రోడ్డు యథాతథంగా ఉండేలా కృషి చేస్తానని ఎమ్మెల్యే కృష్ణారావు కాలనీ ప్రజలకు హామీనిచ్చారు. రోడ్డు విస్తరణ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగిందని.. ప్రజల కోరిక మేరకు రోడ్డు యథాతథంగా ఉంచి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. హోటళ్ల కారణంగా రోడ్లపైకి వస్తున్న మురుగు నీటిని నివారించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు. మురుగునీటి వ్యవస్థను బలోపేతం చేసి రోడ్లపైకి మురుగునీరు రాకుండా చూడాలని కోరారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల సహకారంతో నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వసంతనగర్ సొసైటీ అధ్యక్షుడు యెర్రా నాగేశ్వర్రావు, రాణాప్రతాప్, చంద్రారెడ్డి, కృష్ణమూర్తి, నాగిరెడ్డి, పద్మ, రజని, మురళీకృష్ణంరాజు, అనిల్వర్మ, నాంచారయ్య, నర్సయ్య, స్థానికులు శ్యామలరాజు, నాగప్రసాద్, గంగారావు, జీహెచ్ఎంసీ ఈఈ సత్యనారాయణ, డీఈ ఆనంద్, ఏఈ సాయిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
క్రీడలతో శారీరక మానసికోల్లాసం
క్రీడలతో శారీరక మానసికోల్లాసం కలుగుతుందని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆదివారం కేపీహెచ్బీ కాలనీ 3వ ఫేజ్ ఇండోర్ స్టేడియంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ 5వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించిన ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ను ఎమ్మెల్యే కృష్ణారావు, కార్పొరేటర్ శ్రీనివాస్రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలంటే ప్రతిఒక్కరూ నిత్యజీవితంలో ఆటలు, యోగా, నడకకు ప్రాధాన్యతనివ్వాలని కోరారు. కాలనీలో క్రీడా అభ్యున్నతి కోసం ఇండోర్ స్టేడియంలు నిర్మించి క్రీడాకారులను ప్రోత్సహిస్తున్నట్లు తెలిపారు. బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న క్రీడాకారులకు అభినందనలు తెలుపుతూ.. గెలుపు ఓటములు సహజమని.. పోటీల్లో సత్తాను చాటాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ నేతలు జనగాం సురేశ్ రెడ్డి, అమిర్నేని సత్యనారాయణ, విష్ణురావు, గురునాథ్, విజయ్, శివ, రాఘవ, శ్రీనివాస్, ఆనంద్, మురళీ, శ్రవణ్ తదితరులున్నారు.