సిటీబ్యూరో, ఆగస్టు 20 (నమస్తేతెలంగాణ): ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించడమే లక్ష్యంగా హ్యాపీ హైదరాబాద్ సైక్లిస్టులు వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తెలంగాణ వ్యాప్తంగా ప్లాస్టిక్తో కలిగే అనర్థాలపై అవగాహన కల్పించేందుకు సిద్ధమయ్యారు. ఆయా ప్రాంతాల సైక్లిస్టులను సమన్వయం చేసుకుని ఈవెంట్స్ ఏర్పాటు చేసి అందులో ప్లాస్టిక్ వాడొద్దంటూ పిలుపునిస్తున్నారు. ప్లాస్టిక్ భూతాన్ని తరిమేయకపోతే భవిష్యత్ ప్రమాదకరంగా మారడం ఖాయమని వివరిస్తున్నారు. మరీముఖ్యంగా హైదరాబాద్, వరంగల్లలో ప్లాస్టిక్ నియంత్రణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. సామాజిక బాధ్యతతోనే ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. తాజాగా వరంగల్లోని సైక్లిస్టులతో కలిసి ప్లాస్టిక్ నియంత్రణపై రైడ్ నిర్వహించారు. ప్లకార్డులు, కరపత్రాలు పంచుతూ అవగాహన కల్పించారు. ఓ వైపు ఐటీ, ఫార్మా కంపెనీల్లో ఉద్యోగాలు చేస్తూనే మరోవైపు ప్లాస్టిక్ నియంత్రణపై వారు యుద్ధం చేస్తున్నారు. త్వరలో రాష్ట్రవ్యాప్తంగా సైక్లింగ్ రైడ్తో ప్లాస్టిక్పై అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తామని నిర్వాహకులు తెలిపారు.
పోలిమర్లు, మోనోమర్ల కలయికే ప్లాస్టిక్. దీని తయారీకి పెట్రోలియాన్ని వినియోగిస్తారు. అంతేకాక ప్లాస్టిక్లో ైస్టెరీన్, బెంజీన్ లాంటి విషపూరిత రసాయనాలుంటాయి. ఇవి క్యాన్సర్ ముప్పును పెంచుతాయి. నాడీ వ్యాధులు, శ్వాసకోస, ప్రత్యుత్పత్తి సమస్యలు, కిడ్నీ, కాలేయ రుగ్మతలకు దారితీస్తాయి. నేల, నీటిలో కలిసే సమయంలో ఇవి కొన్ని హానికర రసాయన పదార్థాలను విడుదల చేస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో పండించే పంటలతో పాటు జలవనరులూ కలుషితమవుతాయి. జలచరాలకు ముప్పు ఏర్పడుతుంది.
గ్రామాల్లో సైతం ప్లాస్టిక్ను విరివిగా వాడుతున్నారు. వ్యవసాయం, అనుబంధ రంగాల్లో ప్లాస్టిక్తో తయారైన వస్తువులను అనేకం ఉపయోగి స్తున్నారు. వాడిన ప్లాస్టిక్ క్యారీ బ్యాగ్స్, కాలం చెల్లిన పైపులను ఎక్కడ పడితే అక్కడ వేయడం మంచి పద్ధతి కాదు. గ్రామ పంచాయతీ స్థాయిలో ప్లాస్టిక్ రీసైక్లింగ్పై అవగాహన పెంచాలి. తడి, పొడి చెత్త మాదిరి ప్లాస్టిక్ను వేరుచేసే విధానాన్ని ప్రవేశపెట్టాలి. అప్పుడే ప్రణాళికాబద్ధంగా ప్లాస్టిక్ను సేకరించే అవకాశం ఉంటుంది. -స్రవంతి రెడ్డి, సైక్లిస్టు
ప్లాస్టిక్ మంచిది కాదని తెలిసినా మనం విపరీతంగా వాడేస్తున్నాం. ఒక్క ప్లాస్టిక్ కవర్ తయారు కావడానికి 12 నిమిషాలు పడితే అది భూమిలో కలవడానికి మాత్రం వెయ్యి ఏండ్లు పడుతుంది. దీన్ని బట్టి చూస్తే ప్లాస్టిక్ ఎంత ప్రమాదకారో మనమందరం అర్థం చేసుకోవచ్చు. మనం వాడేసిన ప్లాస్టిక్ కవర్లను జంతువులు తింటూ ప్రాణాలు విడుస్తున్నాయి. ఇది ఎంతో బాధకరమైన విషయం. సమాజంలో అణువణువునా నిండిన ప్లాస్టిక్ నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.- సాయి తేజస్విని, సైక్లిస్టు
ఇప్పుడు లైట్ తీసుకుంటే భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రతిఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలి. ప్లాస్టిక్ నియంత్రణకు అందరూ కలిసి రావాలి. ప్లాస్టిక్ బ్యాగులు, ఫుడ్ ప్యాకేజీ కంటెయినర్లు పర్యావరణంలో కలిసేందుకు వెయ్యేండ్ల వరకు పడుతుంది. అందుకే ప్లాస్టిక్ను పూర్తిస్థాయిలో నిర్మూలించేందుకు రాష్ట్రవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. -మాన్సీ, సైక్లిస్టు, వరంగల్
ప్రస్తుతం సమాజంలో ప్లాస్టిక్ వినియోగం భారీగా పెరిగింది. పరోక్షంగా ప్లాస్టిక్తో ఎన్నో అనర్థాలు కలుగుతున్నాయి. ఏటా ప్రపంచవ్యాప్తంగా ఐదు ట్రిలియన్ టన్నుల ప్లాస్టిక్ బ్యాగ్లను ఉపయోగిస్తున్నారని పలు సర్వేల్లో తేలింది. ఒక గంటలో ఉపయోగించే ప్లాస్టిక్ను తాడులా పేనితే మన భూమిని ఏడు సార్లు చుట్టొచ్చంటే పరిస్థితి తీవ్రత అర్థం చేసుకోవచ్చు. -సాంబరి రవి,
హైదరాబాద్ సైక్లిస్ట్