కరోనా విజేతలు ప్లాస్మా దానం చేసేందుకు ముందుకు రావాలని వైద్య నిపుణులు విజ్ఞప్తి చేస్తున్నారు. ఒక్కరి ప్లాస్మాతో ముగ్గురి ప్రాణాలు కాపాడవచ్చని, ఇప్పటి వరకు 80శాతం వరకు ఫలితాలు సాధించామని చెబుతున్నారు. ప్లాస్మాదానంతో 13వేల మంది కరోనానుంచి బయటపడడం నిజంగా గొప్పవిషయమని హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్లాస్మాదానంతో ఎలాంటి ప్రమాదం లేదని, కరోనాతో పోరాడి గెలిచిన వారు 15రోజుల తర్వాత ప్లాస్మాదానం చేసేందుకు ముందుకువచ్చి బాధితులకు అండగా నిలువాలని కోరుతున్నారు.
ప్లాస్మాతో రోగిలో వైద్య చికిత్సలు పొందేందుకు అనువైన పరిస్థితులు ఏర్పడుతాయి. ఊపిరితిత్తులు, గుండె పై వైరస్ ప్రభావం పడకుండా అడ్డుకుంటుంది. శరీరంలో యాంటీ బాడీస్ను పెంచుతుంది. వెంటిలేటర్పై ఉండే వారికి ఒక శక్తిలా పనిచేస్తుంది. 80శాతం పైన ప్లాస్మాతో జరిగిన చికిత్సలు సంపూర్ణ ఫలితాలను ఇచ్చాయి. -సాయి రవిశంకర్, సీనియర్ కన్సల్టెంట్ కార్డియాలజిస్టు, ఎస్ఎల్జీ హాస్పిటల్
కరోనా విజేతలు ప్లాస్మా దానం చేయడానికి ముందుకు రావాలి. ప్లాస్మా దానంతో ఇద్దరు లేదా ముగ్గురి ప్రాణాలను నిలుపవచ్చు. తిరిగి 48 నుంచి 72 గంటల్లో ప్లాస్మా మీ శరీరంలో ఉత్పత్తి అవుతుంది. గత ఏడాది దాదాపు 6 వేల మంది దాతలు ముందుకు రావడంతో 10వేల మందిని కాపాడగలిగాం. తాజాగా 1400 మంది ప్లాస్మా ఇవ్వడంతో 2400 మందికి ఉపయోగం కలిగింది. ప్లాస్మా ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా.. సైబరాబాద్ కోవిడ్ కంట్రోల్ నం.9490617440, లేదా donateplasma.scsc.in లో రిజిస్టర్ చేసుకోవాలి.-సీపీ సజ్జనార్, సైబరాబాద్ పోలీసు కమిషనర్
ప్లాస్మాను అనేక రకాల మెడిసిన్తో కలిపి ఇస్తారు. ఇలా సమయానికి వైద్యం అందడంతో చాలా మంది కరోనా బాధితులు ప్రాణాలతో బయటపడ్డారు. కరోనా విజేతలు ఎలాంటి అనుమానాలు లేకుండా ముందుకు రావాలి. ప్లాస్మాదానంతో యాంటీ బాడీస్ తగ్గిపోవు. ప్రాణానికి ఎలాంటి హాని ఉండదు. శరీరంలో ఒక సారి యాంటీ బాడీస్ పెరుగడం మొదలైతే అవి పెరుగుతూనే ఉంటాయి. -నందకిశోర్, యశోద హాస్పిటల్..
కోవిడ్ బారిన పడిన వారు త్వరగా దవాఖానలో చేరితే వైద్య చికిత్సలు, మందులతో కలిపి ప్లాస్మాను అందిస్తున్నాం. ఇలాంటి చికిత్స అందిన వారు చాలామంది ప్రాణపాయ స్థితి నుంచి బయటపడ్డారు. కరోనా లక్షణాలను ముందుగానే గుర్తించి వెంటనే దవాఖానలో చేరితే ప్రమాదం తప్పుతుంది. -డా.అపర్ణ శర్మ, కేర్ హాస్పిటల్.