జూబ్లీహిల్స్,ఆగస్టు10 : స్వచ్ఛమైన గాలినందించే నేటి మొక్కలే ఆరోగ్యాన్ని పంచే రేపటి చెట్లుగా మానవాళి మనుగడలో ప్రధాన భూమిక పోషిస్తాయని తెలంగాణ స్పెషల్ పోలీస్ బెటాలియన్స్ అదనపు డీజీపీ అభిలాష బిస్త్ పేర్కొన్నారు. మంగళవారం యూసుఫ్గూడ ప్రథమ పటాలంలో లా అండ్ ఆర్డర్ అడిషనల్ డీజిపి డాక్టర్ జితేందర్, నగర పోలీసు సంయుక్త కమిషనర్ అవినాష్ మహంతిలతో కలిసి తెలంగాణకు హరితహారం కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మొక్కలు ఆరోగ్య ప్రదాయినిగానే కాక అనారోగ్యాలను దూరం చేసే సంజీవనిగా కూడా ఉపయోగపడుతాయన్నారు.
ప్రతి ఒక్కరూ మొక్కలు పెంచి వాటిని సంరక్షించడం ద్వారా ఆరోగ్యకర సమాజానికి బాటలు వేయాలని కోరారు. కార్యక్రమంలో టీఎస్ఎస్పీ బెటాలియన్స్ అధికారులు డీఐజీ ఎంఎస్ సిద్దిఖీ, ఓఎస్డీ పి.సత్యనారాయణ, సీఏఓ శ్రీరామ్, ఫస్ట్ బెటాలియన్ కమాండెంట్ అనూప్ కుమార్ మిశ్రా, అదనపు కమాండెంట్ కె.వీరయ్య, అసిస్టెంట్ కమాండెంట్స్ జి.రాజు, కె.సంపత్ కుమార్ రెడ్డి, జె.రాందాస్, బి.జవహర్లాల్ తదితరులు పాల్గొన్నారు.