సిటీబ్యూరో, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ఎన్నికలకు ముందస్తు ప్రణాళికలు రూపొందించుకోవాలని జీహెచ్ఎంసీ కమిషనర్ డీఎస్ లోకేశ్కుమార్ అన్నారు. వచ్చే నవంబర్ నుంచి మొదలయ్యే అసెంబ్లీ, పార్లమెంటరీ, స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని సహాయ ఎన్నికల రిటర్నింగ్ అధికారులకు ఆయన సూచించారు. రాష్ట్రస్థాయి ఎన్నికల సహాయ రిటర్నింగ్ అధికారులకు (డిప్యూటీ తాసీల్దార్లకు) రెండు రోజుల పాటు జరిగిన శిక్షణ ముగింపు కార్యక్రమంలో శనివారం కమిషనర్ పాల్గొన్నారు.
ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ముందస్తు పనులను గుర్తించి, వేగవంతంగా చర్యలు తీసుకునేందుకు శిక్షణ, పరీక్షలను నిర్వహించి అవగాహన కల్పించామని తెలిపారు. రిసోర్స్ పర్సన్ జయచంద్రారెడ్డి మాట్లాడుతూ.. సిబ్బంది ఎన్నికల నిర్వహణలో ప్రతి అంశంపై సమగ్ర సమాచారం కలిగి ఉండాలన్నారు. రాజకీయ నాయకుల ఖర్చును ఎప్పటికప్పుడు నమోదు చేయాలని, కోడ్ ఉల్లంఘన, ఓటర్లను ప్రభావితం చేసే అంశాలపై భారత ఎన్నికల సంఘం నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని చెప్పారు. సీఈవో కార్యాలయం ఐటీ సెక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ డి.చిరంజీవులు మాట్లాడుతూ.. ఎన్నికల్లో టెక్నాలజీ పరంగా ఈఎన్సీఓఆర్ఈఈ, సీ-విజిల్, ఎన్జీఎస్, వెబ్ కాస్టింగ్ వంటి ఆన్లైన్ సేవలను ఏర్పాటు చేసేందుకు ఏఈఆర్ఓలు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఈవో సత్యవతి, ఏఎస్ఓ పాండు రంగారెడ్డి, అసిస్టెంట్ సెక్రటరీ సయ్యద్ ఆరీఫ్ పాల్గొన్నారు.