HMDA | సిటీబ్యూరో, ఫిబ్రవరి 18 (నమస్తే తెలంగాణ): సామాన్యుడి సొంతింటి కలను నిజం చేసుకునేందుకు చేస్తున్న ప్రయత్నానికి హెచ్ఎండీఏ టౌన్ప్లానింగ్ అధికారులు అడుగడుగునా కొర్రీలు పెడుతున్నారు. త్వరగా ఇంటి అనుమతి కావాలంటే తాము అడిగినంత ఇవ్వాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. గత కేసీఆర్ ప్రభుత్వం ఆన్లైన్లోనే అనుమతులు పొందేలా టీఎస్ బీ పాస్ పాలసీని తీసుకొచ్చింది. అన్ని పత్రాలు ఉంటే ఇన్స్టంట్ అప్రూవల్ పొందే అవకాశం కల్పించింది. అదేవిధంగా 21 రోజుల్లోనే 240 గజాల లోపు స్థలాల్లో నిర్మించే భవనాలకు అనుమతులు పొందవచ్చు. అయితే ప్రస్తుతం ఈ పాలసీని ప్లానింగ్ విభాగం అధికారులు సరిగ్గా అమలు చేయడం లేదని, అదేవిధంగా లే అవుట్ల అనుమతుల విషయంలోనూ తీవ్ర జాప్యం జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో హెచ్ఎండీఏలో భవన నిర్మాణ అనుమతుల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. ఇంటి అనుమతుల కోసం ఆన్లైన్ విధానం ఉన్నా… పట్టించుకోవడం లేదు. ఆఫ్లైన్లో వచ్చి కలవాల్సిందే అన్నట్లు షార్ట్ఫాల్స్ పేరుతో కాలయాపన చేస్తున్నారు. దరఖాస్తుదారు లేదంటే అతడి తరపున ఆర్కిటెక్ట్, ప్లానర్, లైజనింగ్ చేసే మధ్య దళారి… ఇలా ఎవరైనా వచ్చి సంబంధిత ప్లానింగ్ అధికారులను కలిసి దరఖాస్తు చేసుకున్న ఇంటి వివరాలను చెప్పుకోవాల్సిన పరిస్థితి నెలకొన్నది.
హెచ్ఎండీఏ పరిధిలో ఇండ్ల నిర్మాణం చేపట్టే వారంతా అమీర్పేటలోని స్వర్ణజయంతి కమర్షియల్ కాంప్లెక్సులో హెచ్ఎండీఏ ప్రధాన కార్యాలయానికి రావాల్సిందే. ముఖ్యంగా ఔటర్ రింగు రోడ్డు చుట్టూ పక్కల ప్రాంతాల్లోనే ఎక్కువగా నిర్మాణాలు జరుగుతుండడంతో ఇక్కడి వారంతా 20-30 దూరంలో ఉన్న అమీర్పేటకు రావాల్సి వస్తున్నది. పైగా ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా మధ్యాహ్నం 3 గంటల తర్వాతే రావాలన్న నిబంధన పెట్టారు. పరిపాలనా సౌలభ్యం కోసం హెచ్ఎండీఏ పరిధిలో 4 జోన్లుగా విభజించారు. ఇందులో శంకర్పల్లి, శంషాబాద్, మేడ్చల్, ఘట్కేసర్ జోన్లు ఉండగా, ఆయా జోన్ల పరిధిలోని ప్రాంతాల నుంచి దరఖాస్తుదారులు నిత్యం వందలాది మంది ప్లానింగ్ విభాగానికి వస్తున్నారు. దీంతో ఒక్కసారిగా ఆ విభాగం మార్కెట్ను తలపిస్తున్నది. చాంబర్లలో కుర్చీల నిండా, క్యాబిన్స్ వద్ద ఏపీవో, జేపీవో, సెక్షన్ అధికారుల వద్ద పడిగాపులు కాస్తూ అనుమతుల విషయాన్ని ఆరా తీస్తూ కనిపిస్తూ ఉంటున్నారు.
హెచ్ఎండీఏ ప్లానింగ్ విభాగంలోకి వెళ్లాలంటే పోలీసు శాఖ హోంగార్డు లేదా కానిస్టేబుల్, ప్రైవేటు సెక్యూరిటీ గార్డు అనుమతివ్వాల్సిందే. అంతేకాదు వచ్చిన వారంతా రిజిస్టర్లో పేరు రాసి సంతకం పెట్టిన తర్వాతే అనుమతిస్తున్నారు. ఇంటి నిర్మాణ అనుమతుల్లో సులభమైన విధానం అమల్లో ఉన్నా… దరఖాస్తుదారులు హెచ్ఎండీఏ కార్యాలయానికి రావాల్సిన అవసరం ఎందుకని నిలదీస్తున్నారు. ఇప్పటికైనా హెచ్ఎండీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ ప్లానింగ్ విభాగంలో జరుగుతున్న పని విధానం, ఇండ్ల నిర్మాణ అనుమతుల కోసం పడుతున్న ఇబ్బందులను గుర్తించి, వారికి సత్వరమే నిబంధనలకు ప్రకారం ప్లానింగ్ అధికారులు టీఎస్ బీ పాస్ నిబంధనల్లో సూచించినట్లు నిర్ణీత సమయాల్లో అనుమతులు జారీ చేయాలని కోరుతున్నారు.