వనస్థలిపురం, ఫిబ్రవరి 22: పాలకులు, అధికారుల దుర్మార్గపు పోకడల కారణంగా సామాన్యులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రజల శ్రేయస్సు కోసం పాటు పడాల్సిన ప్రజా ప్రతినిధులు, అధికార యంత్రాంగం కుమ్మక్కై వారిని పీడించుకు తినేందుకు తయారయ్యారు. కాలనీ అభివృద్ధి పథంలోకి పరుగు తీస్తున్నందంటే.. ముందుగా కాలనీ వాసులే ఎంతో సంబరపడిపోతుంటారు.
పాత డ్రైనేజీ స్థానంలో కొత్తలైన్ వస్తుండటంతో వారంతా ఆనందం వ్యక్తం చేశారు. ఇక తమకు డ్రైనేజీ సమస్యలుండవని సంబరపడ్డారు. తీరా పనులు పూర్తయ్యాక అది తమకు గుదిబండగా మారిందని ఆందోళన చెందుతున్నారు. ఇది పేదల బస్తీ, గుంటి జంగయ్య కాలనీలో పరిస్థితి. డ్రైనేజీ నిర్మాణం పూర్తయ్యాక ఇళ్లలోకి కనెక్షన్ తీసుకోవడానికి రూ.5 నుంచి 15 వేలు వసూలు చేస్తుండడం వారికి భారంగా మారింది.
గుంటి జంగయ్య కాలనీలో ఇంటి నం. 3-10-184 నుంచి 3-10-443/7/1 వరకు డ్రైనేజీ పునరుద్ధరణ మంజూరయ్యింది. ఇటీవల కాంట్రాక్టర్ పనులను ప్రారంభించారు. గతంలో ఉన్న పాత డ్రైనేజీ విధానాన్ని తొలగించి కొత్త పైపులు వేసి, మ్యాన్హోళ్లను నిర్మించాలి. కాని, మ్యాన్హోళ్లను అదే స్థానంలో కాకుండా వెనుకా ముందు నిర్మించడంతో సమస్య ఉత్పన్నమయ్యింది. మ్యాన్హోళ్లు అదే స్థానంలో ఉంటే ఇళ్లలోకి కనెక్షన్ కలుపుకునేవారికి ఇబ్బంది ఉండేది కాదు. పాత కనెక్షన్ను తిరిగి కలుపుకుంటే అయిపోయేది. కాని, మ్యాన్హోళ్లు స్థానభ్రంశం చెందడంతో ప్రజలు తమ ఇండ్లకు కనెక్షన్ తీసుకోవడం సమస్యగా మారింది. పాత కనెక్షన్ను పూర్తిగా తొలగించి కొత్తగా పైపులు వేసుకోవాల్సి వచ్చింది.
దీనికి గుత్తేదారు సిబ్బంది రూ.5 నుంచి 15 వేల వరకు వసూలు చేస్తున్నారు. అసలే పేదల బస్తీ వారి ఆదాయం అంతంత మాత్రం, ఇంటికి డ్రైనేజీ లైన్ తప్పనిసరి కావడంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియక సతమతమవుతున్నారు. చేసేది లేక కొంతమంది వాళ్లు అడిగిన డబ్బులు ఇచ్చి కనెక్షన్ కలుపుకోవాల్సి వచ్చింది. దాంతో పాటు దెబ్బతిన్న తాగునీటి కనెక్షన్ల పునరుద్ధరణకు కూడా డబ్బులు వసూలు చేసినట్లు స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇదంతా జల మండలి అధికారులకు తెలియకుండానే జరుగుతోందా? అన్న ప్రశ్న తలెత్తుతోంది. కాగా, ఈ విషయంపై జలమండలి అధికారి రవీందర్రెడ్డి తమకేమీ తెలియదంటూ.., కార్పొరేటరో, ఎమ్మెల్యేనో చెప్పి ఉంటారు. అందుకే మార్చి ఉండవచ్చని తనదైన శైలిలో చెప్పడం కొసమెరుపు.
పునర్నిర్మాణంలో మ్యాన్హోళ్లను ఎట్టి పరిస్థితుల్లో మార్చం. ఇక్కడ ఎలా మారిందో.. మాకు తెలియదు. ప్రజల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న విషయం మా దృష్టికి రాలేదు. ఎవరైనా రాత పూర్వకంగా ఫిర్యాదు చేస్తే చూస్తాం. కార్పొరేటరో, ఎమ్మెల్యేనో చెప్పి ఉండవచ్చు అందుకే మ్యాన్హోళ్లను మార్చి ఉంటారు. దీనికి సంబంధించి ఏ విషయము మా దృష్టిలోకి రాలేదు.
– రవీందర్రెడ్డి, జలమండలి అధికారి
మా కాలనీలో జరుగుతున్న డ్రైనేజీ పనుల విషయంలో జల మండలి అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా తెలుస్తోంది. పాత మ్యాన్హోళ్ల స్థానంలోనే కొత్తవాటిని నిర్మిస్తే సరిపోయేది. అధికారులు పనులను పర్యవేక్షణ చేసి, స్పష్టమైన ఆదేశాలిస్తే గుత్తేదారు నిర్మాణం చేసేవారు. కాని, అధికారులు పట్టించుకోకపోవడం కారణంగా ఇష్టారాజ్యంగా పనులు నిర్వహించారు. దీంతో ప్రజలంతా కొత్తగా ఇంటి కనెక్షన్లు తీసుకోవాల్సి వచ్చింది. దానికి తోడు తవ్వకాల్లో దెబ్బతిన్న తాగునీటి కనెక్షన్లు ఇచ్చేందుకు కూడా ప్రజల నుంచి డబ్బులు వసూలు చేశారు. దీనిపై ఉన్నతాధికారులు విచారణ జరపాలి.
– కామల్ల రవి కుమార్, గుంటి జంగయ్య కాలనీ