బంజారాహిల్స్, జూన్ 30 : నగరంలోనే అత్యంత ప్రాముఖ్యత కలిగిన బంజారాహిల్స్లోని కేబీఆర్ నేషనల్ పార్కు వద్ద రోడ్డు పక్కన ఫుట్పాత్ నిర్వహణపై జీహెచ్ఎంసీ తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తుండటంతో వాకర్లు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. కేబీఆర్ పార్కు మెయిన్ గేట్ నుంచి చెక్పోస్ట్ వైపు వెళ్లేరోడ్డుపై హెచ్సిటీ ప్రాజెక్ట్ పనులు చేస్తున్న నేపథ్యంలో ఇటీవల ఫుట్పాత్లో 70శాతం తొలగించి రోడ్డువేశారు.
మిగిలిన 30శాతం ఫుట్పాత్ను పాదచారుల కోసం వదిలిపెట్టారు. అయితే రోడ్డు కోసం తవ్వకాలు జరిపిన గుత్తేదార్లు మట్టిని మొత్తం ఫుట్పాత్ మీద గుట్టలుగా పోయడంతో పాదచారులు నడిచేందుకు వీల్లేకుండా పోయింది. దీనికితోడు పార్కు మెయిన్ గేట్ సమీపంలో ఉన్న ఫుట్పాత్పై ఫ్లెక్సీలు, హోర్డింగ్ల కోసం ఏర్పాటు చేసిన కర్రలు అడ్డదిడ్డంగా ఉండటంతో నడుచుకుంటూ వెళ్లేవారికి ప్రమాదం పొంచి ఉంది.
మల్టీ లెవల్ పార్కింగ్ కాంప్లెక్స్ వద్ద ఏడాది క్రితం నిర్మించిన ఫుట్పాత్ను తవ్వేసి రోడ్డు వేయడంతో పాదచారులు ఇబ్బందికి గురవుతున్నారు. సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కేబీఆర్ పార్కు సమీపంలో ఉన్న ఫుట్పాత్ల నిర్వహణపై దృష్టి పెట్టి.. సమస్య పరిష్కరించాలని వాకర్లు, సందర్శకులు కోరుతున్నారు.