Pick Pocketers |సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): నగరంలో పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ తిరుగుతున్నాయి. ఒంటరిగా నడుచుకుంటూ వెళ్లే వారు, బస్సులు, ప్యాసింజర్ ఆటోలలో తిరుగుతున్న వారిని టార్గెట్ చేస్తున్నారు. పేరుకు పిక్పాకెటర్స్ అయినా ఏడాదికి ట్రై పోలీస్ కమిషనరేట్ల పరిధిలో అనధికారిక లెక్కల ప్రకారం.. రూ.40 కోట్లకుపైగానే కొట్టేస్తున్నారు. నల్లగొండ పోలీసులకు చిక్కిన హైదరాబాద్కు చెందిన కానిస్టేబుల్ ఈశ్వర్ పిక్ పాకెటింగ్ గ్యాంగ్లు నిర్వహించినట్లు వెల్లడికావడంతో అతన్ని అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. పిక్పాకెటింగ్ ముఠాలు నగరంలో వ్యవస్థీకృత ముఠాలుగా పనిచేస్తున్నాయి. ఈ ముఠాల మధ్య గ్యాంగ్వార్, హత్యలు కూడా గతంలో జరిగాయి. టెక్నాజీలతో సాధారణ దొంగతనాలకు పూర్తిస్థాయిలో చెక్పెట్టిన పోలీసులకు ఇప్పుడు జేబు దొంగలు సవాల్ విసురుతున్నారు. జేబు దొంగతనాలు, సెల్ఫోన్ స్నాచింగ్లు కొన్ని మాత్రమే రికార్డుల్లోకి వెళ్తున్నాయి.
నగరంలోని పిక్ పాకెటింగ్ గ్యాంగ్స్ ఏళ్లుగా పని చేస్తున్నాయి. పలు ప్రాంతాలు వీరికి అడ్డాలుగా ఉన్నాయి. ఈ ముఠాలు ఒకప్పుడు కేవలం పర్సులు మాత్రమే కొట్టేశేవారు.. ప్రతి నెలా మొదటి, రెండు వారాల్లో జీతం డబ్బుతో ఇళ్లకు వెళ్లే వారిని లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడేవారు. కాలం మారుతూ బ్యాంకులలో జీతాలు పడడంతో అందుకు క్రెడిట్, డెబిట్ కార్డుల వినియోగాన్ని పెంచారు. దీంతో కార్డులను సైతం కొట్టేసి షాపింగ్ చేసేవారు. అంతా డిజిటల్ పేమెంట్లు కావడం, ప్రతి ఒక్కరి వద్ద సెల్ఫోన్ ఉండడంతో పర్సులు, ఫోన్లపై పడ్డారు. చోరీ చేసిన ఫోన్ల ఐఎంఈఐ (ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్యూప్మెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్) నంబర్ను క్లోనింగ్ చేసి అమ్మడమో లేక రాష్ట్ర సరిహద్దుల్ని దాటించి విక్రయించడమో, కొన్నాళ్ల పాటు వినియోగించకుండా ఉంచేసి తరువాత సొమ్ము చేసుకోవడమో చేస్తున్నారు. దీనికోసం వీరికి అనుబంధంగా మరికొన్ని గ్యాంగ్స్ పని చేస్తుంటాయి. ఈ కారణంగానే చోరీకి గురవుతున్న అన్ని ఫోన్లు ట్రాక్ కావట్లేదు.
రద్దీగా ఉండే బస్సులు, ఆటోలు, మారెట్లను ఎంచుకునే ఈ గ్యాంగ్ సభ్యులు టార్గెట్ను అనుసరిస్తుంటారు. మొదట గ్యాంగ్లోని కొందరు సభ్యులు ఎంచుకున్న వ్యక్తి చుట్టూ చేరుతారు. ఇలా చేరిన వారు లక్ష్యంగా ఎంచుకున్న వ్యక్తి వద్ద హడావిడి చేసి ముందు వెనక్కి కదులుతూ అక్కడ ఒక రకమైన వాతావారణాన్ని కల్పిస్తారు. అప్పటికే అతడి చుట్టూ ఉన్న నాలుగురైదుగురు వాళ్ళకు సంబంధించిన వాళ్లే ఉంటారు. లక్ష్యంగా ఎంచుకున్న ప్రయాణికుడి జేబులో నుంచి పర్సు కొట్టేయగానే అదే గ్యాంగ్లో ఉన్న మరొకరికి దానిని అందించి అక్కడి నుంచి సదరు వ్యక్తిని పంపించేస్తారు. వీరిని వెంబడిస్తూ ఒక ఖాళీ అటో వస్తుంది. పని పూర్తి కాగానే ఒక్కొక్కరు దిగిపోతూ ఉంటారు. బస్సులతో పాటు రద్దీ ప్రాంతాలలో ఇలానే చేస్తుంటారు. ఈ జేబు దొంగతనాలకు ముఠా సభ్యులు శిక్షణ పొంది ఉంటారు. పిక్పాకెటింగ్ చేస్తూ ఎవరైనా దొరికితే మిగతా వాళ్లు తమకు సంబంధం లేదన్నట్లు అక్కడి నుంచి వెళ్లిపోతారు. ఒక వేళ పోలీసులు వచ్చి పట్టుకున్నారంటే అతడొక్కడే జైలుకు వెళ్తాడు, మిగతా వాళ్లు బయట ఉండి కథ నడిపిస్తుంటారు. జైలుకు వెళ్లిన వారిని బెయిల్పై బయటకు తీసుకొచ్చే బాధ్యత వాళ్లు తీసుకుంటారు. వీళ్లంతా సీసీ కెమెరాలు లేని ప్రాంతాలలోనే చోరీలకు పాల్పడుతుండటంతో పోలీసులకు వెంటనే దొరకడం లేదు. ప్రధానంగా రైళ్లు, బస్సులలో ఈ పిక్పాకెటింగ్లు జరుగుతున్నాయి.