Cyber Crime | సిటీబ్యూరో, జనవరి 25 (నమస్తే తెలంగాణ) : మేం సీబీఐ అఫీసర్స్ మాట్లాడుతున్నాం.. రెండు గంటల్లో ఢిల్లీకి రావాలి.. మీపై ఇక్కడ కేసు నమోదైంది.. మీరు రాకుంటే అరెస్ట్ చేసి తీసుకురావాల్సి వస్తుంది.. మీపై డ్రగ్ స్మగ్లింగ్ కేసు నమోదైంది. మీ ఫోన్ నంబర్ దీనిపై రాసి ఉండడంతో మీకు ఫోన్ చేస్తున్నాం.. మీకు అనుమానం ఉంటే.. స్కైప్.. వాట్సాఫ్లో వీడియో కాల్స్లో ప్రాథమిక విచారణ చేస్తాం.. మేము అడిగే అన్ని ప్రశ్నలకు సమాధానాలు చెప్పాలి.. మీ బ్యాంకు ఖాతాలు స్తంభింప చేస్తున్నాం. అంటూ సైబర్నేరగాళ్లు అమాయకులపై విరుచుకుపడుతూ కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. ఫెడెక్స్ కొరియర్ ద్వారా మీ పేరుతో డ్రగ్ విదేశాలకు వెళ్తుందని, విదేశాల నుంచి మీ చిరునామాకు వస్తుందంటూ ముందుగా కస్టమ్స్ అధికారులుగా ఫోన్ చేసి, అదే ముఠాలోని సభ్యులు సీబీఐ అఫీసర్, సైబర్ క్రైమ్ పోలీసుగా మాట్లాడుతూ రిటైర్డు ఉద్యోగులను లక్ష్యంగా చేసుకొని హడలెత్తిస్తున్నారు. హైదరాబాద్, రాచకొండ కమిషనరేట్ సైబర్క్రైమ్ ఠాణాలో నమోదైన రెండు ప్రధాన కేసుల వివరాలు ఇలా ఉన్నాయి..
జిల్లెలగూడకు చెందిన రిటైర్డు డీఆర్డీఎల్ సైంటిస్ట్కు ఫెడెక్స్ కొరియర్ నుంచి రిషి వర్మను మాట్లాడుతున్నానంటూ ఈ నెల 20వ తేదీన ఫోన్ వచ్చింది. ముంబాయి నుంచి ఇరాన్కు ఒక పార్సిల్ వెళ్తుంది. ఇందులో కొన్ని నిషేధిత వస్తువులున్నట్లు గుర్తించాం. ఈ కాల్ను ముంబాయి సైబర్క్రైమ్ డిపార్టుమెంట్కు బదిలీ చేస్తున్నామని చెప్పారు. అక్కడి నుంచి తాము ముంబాయి సైబర్క్రైమ్ పోలీసులము మాట్లాడుతున్నాం. కొన్ని మనీ లాండరింగ్ వ్యవహారాలు నడుస్తున్నాయి. అందులో మీ ఫోన్ నంబర్, ఆధార్ కార్డు ఉంది. పార్సిల్తో పాటు ఇవన్నీ ఉండడంతో మీపై అనుమానాలున్నాయి. మీ పేరు లిస్ట్లో నుంచి తీసేయాలంటే స్కైప్లో మీకు ఫోన్ చేసి మీ వాంగ్మూలం రికార్డు చేస్తామన్నారు. ఈ మేరకు స్కైప్లో కాల్ కనెక్ట్ అయి, సీబీఐ, ఆర్బీఐ అధికారులమంటూ ఐడీ కార్డులు చూపించారు. వాటిని చూసిన బాధితుడు నిజమైన అధికారులని నమ్మాడు. స్కైప్లో వివిధ విషయాలు మాట్లాడుతూ మీ బ్యాంకు ఖాతాలు తనిఖీ చేయాలి, వెంటనే వివరాలు చెప్పండంటూ కోరారు. బాధితుడు బ్యాంకు ఖాతా వివరాలు ఇవ్వడంతో అందులో ఉన్న ఫిక్స్డ్ డిపాజిట్ రద్దు చేసి సేవింగ్ ఖాతాలోకి బదిలీ చేశారు. ఆ తరువాత రూ.1.09 కోట్లు నాలుగు దఫ దఫాలుగా వివిధ బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. ఇదంతా స్కైప్లో బాధితుడిని విచారణ పేరుతో మాటల్లో పెట్టి బ్యాంకు ఖాతాలు తనిఖీ పేరుతో లూటీ చేయడంతో బాధితుడు రాచకొండ సైబర్క్రైమ్ పోలీసులకులో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.
న్యూ మలక్పేట్కు చెందిన 65 ఏండ్ల వృద్ధుడికి ఈ నెల 5వ తేదీన ఫోన్ వచ్చింది. ఒక యువతి మాట్లాడుతూ కస్టమ్స్ నుంచి మాట్లాడుతున్నాం.. ఎమర్జెన్సీ కాల్ మీరు 9 నొక్కితే సంబంధిత అధికారి మీతో మాట్లాడుతాడంటూ తెలిపింది. ఆయన 9 నంబర్ నొక్కడంతో ఒక వ్యక్తి మాట్లాడుతూ మీ పేరుతో పార్సిల్ వచ్చింది. అందులో పాస్పోర్టు, ఏటీఎం కార్డులతో పాటు 150 గ్రాముల డ్రగ్ ఉందంటూ సూచించాడు. బాధితుడు నేను ఎవరికి ఎలాంటి పార్సిల్ చేయలేదంటూ వాధించాడు. అయితే పార్సిల్పై మీ ఫోన్ నంబర్ ఉంది. మీకు సహాయం చేసేందుకు ఢిల్లీ పోలీసులు సిద్ధంగా ఉన్నారు. వాళ్లకు ఫోన్ కలుపుతానంటూ ఇతరులతో మాట్లాడించాడు. తాము ఢిల్లీ పోసులులమని మీరు ఇక్కడకు వస్తే మేం సహాయం చేస్తామంటూ నమ్మించారు. తన ఆరోగ్యం బాగోలేదని రాలేనంటూ బాధితుడు తెలిపాడు. మీరు రాలేకపోతే వాట్సాప్లో వివరాలు తీసుకుంటామంటూ నమ్మించారు. బాధితుడి ఆధార్కార్డు, పాన్కార్డు అడిగి తీసుకున్నారు. వాట్సాప్లో మాట్లాడుతూ మీరు మనీ లాండరింగ్కు పాల్పడుతున్నారని తెలిపారు. మీ బ్యాంకు ఖాతాలలో భారీ ఎత్తున లావాదేవీలు జరిగినట్లు గుర్తించామని, మీపై అరెస్ట్ వారెంట్ జారీ చేస్తున్నామంటూ బెదిరించారు. ఆ తరువాత కోర్టు అఫీసర్ మాట్లాతాడంటూ కోర్టుకు ఫోన్ కనెక్ట్ చేశారు.
ఈ రోజు టైమ్ అయిపోయింది రేపు కోర్టులో ప్రొసిడింగ్స్ ఉంటాయంటూ మరో వ్యక్తి మాట్లాడాడు. ఫోన్లో మాట్లాడుతూ ఉండాలి, ఎవరికి చెప్పకూడదంటూ ఐడీబీఐ, ఎస్బీఐ, హెచ్డీఎఫ్సీ బ్యాంకుల వద్దకు పంపించారు. వెంటనే ఫలాన ఖాతాలలోకి డబ్బు పంపించాలంటూ డిమాండ్ చేశారు. మీ ఫోన్ పోలీస్ మానిటరింగ్లో ఉంటుదంటూ బెదిరించి రూ.58.12 లక్షలు కాజేశారు. ఆ తరువాత బెయిల్కు, సెక్యూరిటీ డిపాజిట్ అంటూ రూ.34 లక్షలు డిమాండ్ చేశారు. తన వద్ద డబ్బు లేదని తెలిసిన వారి వద్ద అడిగి తీసుకోవాలంటూ బతిమాలాడు. బంగారాన్ని తాకట్టుపెట్టాడు, కారును అమ్మేసేందుకు ప్రయత్నిస్తూ, తనకు డబ్బులు అర్జెంట్ అవసరమని తన మేనల్లుడిని అడిగాడు. అంత అర్జెంట్ ఎందుకంటూ అడగడంతో పోలీసులు ఇలా తనను వెంటాడుతున్నారంటూ చెప్పాడు. ఇదంతా మోసమని మీరు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయడంటూ బాధితుడికి సూచించడంతో హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వెంగళరావునగర్, జనవరి 25: రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని వద్ద నమ్మకంగా ఉన్న ఓ యువకుడు రూ.35 లక్షలు కాజేసిన సంఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్నది. పోలీసుల కథనం ప్రకారం.. రహ్మత్నగర్లో నివాసముండే రిటైర్డ్ ప్రభుత్వ ఉద్యోగిని కె.రాజేశ్వరి (68) భర్త జశ్వంత్ సింగ్ ఇంటి సమీపంలో కోనేరు విక్రమాధిత్య అలియాస్ సందీప్ కూరె (30) నివాసముండేవాడు. తరచుగా జశ్వంత్ సింగ్ ఇంటికి వస్తూ వారి కుటుంబంతో సన్నిహితంగా మారాడు. ఇటీవల అత్యవసరంగా రూ.10 లక్షలు అవసరం ఉన్నదని జశ్వంత్ సింగ్ నుంచి అప్పుగా తీసుకున్నాడు. కాగా రెండేళ్ల కిందట కరోనా బారిన పడిన జశ్వంత్ సింగ్ మృతి చెందారు. ఆ తర్వాత కూడా రాజేశ్వరి ఇంటికి విక్రమాధిత్య వస్తూ వారికి చిన్న చిన్న పనులు చేసిపెట్టేవాడు. రాజేశ్వరీకి చెందిన ఆన్లైన్ బ్యాంకు అకౌంట్ వివరాలను తెలుసుకున్న విక్రమాధిత్య పలు దఫాలుగా రూ.35,52,059 అతడి అకౌంట్లోకి చేసుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న రాజేశ్వరీ నిలదీయగా విక్రమాధిత్య రావడం మానేశాడు. దీంతో బాదితురాలు మధురానగర్ పోలీలుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.