సిటీబ్యూరో, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): మూలిగే నక్కమీద తాటికాయ పడ్డ చందంగా మారింది సామాన్యుల పరిస్థితి. రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో అన్ని నిత్యావసరాల ధరలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కూరగాయల రేట్లు ఆకాశాన్ని అంటుతున్నాయి. గ్రేటర్కు శివారు జిల్లాలైన ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి 40 శాతం కూరగాయలు సరఫరా అవుతుండగా మరో 10 శాతం రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల నుంచి.. మిగిలిన 50 శాతం కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ నుంచి వస్తాయి. అయితే డీజిల్ ధరల పెరుగుదలతో రవాణా చార్జీలు సైతం అమాంతం పెరిగిపోయాయి. దీంతో రైతులకు కూరగాయలను మార్కెట్లకు తరలించడం తలకు మించిన భారంగా మారుతోంది.
రోజురోజుకూ పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కూరగాయల ధరలకు రెక్కలొస్తున్నాయి. వర్షాల ప్రభావంతో కూరగాయల దిగుబడి తగ్గి రేట్లు పెరగగా.. ప్రస్తుతం ఇంధన ధరలు అమాంతం పెరగడంతో కూరగాయలు కొనడం కష్టంగా మారింది. ప్రస్తుతం డీజిల్ ధర రూ.100, పెట్రోల్ రూ.111.51లకు చేరింది. ఈ ధరలు రోజురోజుకూ ఎగబాకుతూనే ఉన్నాయి. దీంతో కూరగాయలను మార్కెట్కు తరలించాలంటే రవాణా చార్జీలు తడిసి మోపడవుతున్నాయి. దీంతో కూరగాయల హోల్సేల్ ధరలు కిలోకు రూ.1 నుంచి రూ.2 లకు పెరగగా.. అవి వినియోగదారులకు చేరేసరికి మరింత మండుతున్నాయి.
సాధారణంగా డీజిల్, పెట్రో ల్ ధరలు పెరిగినప్పుడు నిత్యావసరాల ధరలు అమాంతం పెరుగుతాయి. క్రమంగా పెరుగుతున్న ఇంధన ధరలు కూరగాయ ల రవాణాపై ప్రభావం చూపుతున్నాయి. ఇటీవ ల కురిసిన వర్షాలు కూడా కూరగాయల ధరల పెరుగుదలకు కారణం. ఫ్యూయల్ ధరలు తగ్గితేనే మిగతా అన్ని రకాల నిత్యావసరాలు అందరికీ అందుబాటులోకి వస్తాయి. అపర్ణ, గుడిమల్కాపూర్ మార్కెట్ అధికారి
పెరిగిన ధరలతో వంద రూపాయలు విడిపిస్తే ఏం వస్తలేవు. దినసరి కూలీల బతుకు దినదిన గండంగా మారింది. కూలీ చేస్తే ఏ రోజుకారోజే సరిపోతుంది. పొదుపు మాట దెవుడెరుగు కుటుంబ అవసరాల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి వస్తున్నది. -కట్టా శ్రీనివాస్, కుత్బుల్లాపూర్
పెట్రోల్, డీజిల్ భారం పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునే వారు బతకడం కష్టంగా మారింది. నిత్యం నిత్యావసరాల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కూరగాయలు కొనలేకపోతున్నాం. కేంద్ర ప్రభుత్వం స్పందించి వెంటనే ధరలను అదుపు చేయాలి. భవిష్యత్ ఇలానే ధరలు పెరిగితే మాత్రం బతకడం కష్టమే. – ఆర్.శీరిష, రెజిమెంటల్బజార్
ఇంట్లోని మూడు వాహనాలకే ప్రతిరోజు రూ.500 అవుతున్నాయి. కూరగాయలు కొనాలంటే ఏడుపు వస్తుంది. నిత్యావసరాలతో పాటు సిమెంట్, ఐరన్, ఇసుక, ఇటుక.. ఇలా ప్రతి వస్తువు ధర పెరుగుతూనే ఉంది. సామాన్యుల పరిస్థితి దయనీయంగా మారింది. కేంద్రప్రభుత్వం స్పందించి పెరిగిన ధరలను తగ్గించే ప్రయత్నాలు ప్రారంభించాలి. -మాణిక్యం, శ్రీరామకాలనీ
పెరుగుతున్న ధరలతో పేదలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్య కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. కరోనా తర్వాత ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కుటుంబాలపై పెరుగుతున్న ధరలు పిడుగులా పడుతున్నాయి.ఇకనైనా కేంద్ర ప్రభుత్వం సామాన్యుల పరిస్థితి అర్థం చేసుకొని ధరలను నియంత్రించాలి. -వసంత,
పెట్రోల్ ధర వంద దాటింది. ప్రతి రోజు బైక్లపై తిరిగే చిరు వ్యాపారులు, ఉద్యోగుల సగం సంపాదన పెట్రోల్, డీజిల్కే పోతుంది. ప్రభుత్వం ఇంధన ధరలను ఎందుకు అదుపు చేయలేకపోతుందో అర్థం కావడం లేదు. ఏడాదిలో ఇన్ని సార్లు పెట్రోల్ ధరలు పెరగడం గతంలో ఎప్పుడూ చూడలేదు. ఓ వైపు వ్యాపారాలు లేక.. మరోవైపు ధరాభారంతో సామాన్యులు అష్టకష్టాలు పడుతున్నారు. – స్వామి, సికింద్రాబాద్
వంట చేయాలంటే యుద్ధం చేయాల్సిన పరిస్థితి. కరోనా వచ్చిన తర్వాత నిత్యావసరాల ధరలు పెరిగిపోయాయి. దానికి తోడు ప్రస్తుతం ఇంధన ధరలు పెరగడంతో ఇక ఆకాశాన్ని అంటాయి. ఒకప్పుడు వంటనూనె ధర రూ.60 నుంచి 70 ఉంటే ప్రస్తుతం రూ.150 నుంచి రూ.160లకు అమ్ముతున్నారు. ఒక్క నూనే కాదు అన్ని పెరుగుతున్నాయి. పేద కుటుంబాలు అతికష్టం మీద బతుకుతున్నాయి. ఆదాయం పెరగకున్నా ఖర్చులు తడిసి మోపడవుతున్నాయి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వం పెరుగుతున్న ధరలను అదుపు చేయాలి. -బి.మల్లమ్మ, గృహిణి
పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతున్నాం. గతంలో వంద రూపాయల పెట్రోల్ పోయిస్తే ఒక్కరోజు వచ్చేది. ఇప్పుడు రెండు వందల రూపాయలది పోసినా సరిపోవడం లేదు. ఇంధన ధరలు పెరగడంతో నిత్యావసరాల రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో సామాన్య, పేద తరగతి ప్రజలు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు. పెరిగిన ధరలకు అనుగుణంగా చిరుద్యోగుల జీతాలు మాత్రం పెరగడం లేదు. – చింతకింది నవీన్, చిరు ఉద్యోగి
గ్యాస్బండ ధర వెయ్యి రూపాయలు అవుతుందని ఊహించలేదు. నిత్యావసరాలు నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. ధరల పెంపు చిరుద్యోగుల జీవితాలను ఛిన్నాభిన్నం చేస్తున్నాయి. ముఖ్యంగా ప్రైవేట్ రంగంలోని ఉద్యోగుల జీవితాలు దుర్భరంగా మారాయి. వచ్చే జీతం సగం నిత్యావసరాలకే పోతుంది. ప్రభుత్వం ధరలను నియంత్రించకపోతే బతకడం కష్టమే. -మహాలక్ష్మి, బోయిగూడ
పెట్రోల్, డీజిల్ ధరలకు అనుగుణంగా రవాణా చార్జీలు పెరగడంతో రైతులు కూరగాయలను అధిక ధరలకు అమ్ముతున్నారు. నాలుగైదు రోజుల కింద ఇంత ధర లేకుండే. రోజురోజుకూ పెరుగుతాయే తప్పా కూరగాయల ధరలు తగ్గడం లేదు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గితేనే వాటి ధరలు తగ్గుతాయి. – మహ్మద్ ముక్తార్, కూరగాయల వ్యాపారి
నిత్యావసరాల ధరల పెరుగుదల పేద, మధ్య తరగతి ప్రజలపై పెనుభారం మోపుతుంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వారు కుటుంబాలను పోషించుకోలేకపోతున్నారు. నెల జీతం నిత్యావసరాలకే సరిపోతుంది. లాక్డౌన్ తర్వాత సామాన్యులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పుడు ధరల పెంపు వారి జీవితాలను బుగ్గిపాలు చేస్తున్నది. -వెంకటేశ్ యాదవ్, కుత్బుల్లాపూర్
పెట్రోల్, గ్యాస్ ధరల నియంత్రణలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఇంధన ధరల ప్రభావం నిత్యావసరాలపైనా పడింది. పెరిగిన ధరలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో పెరిగిన వస్తువుల ధరలతో జనజీవనం అస్తవ్యస్తమైంది. కేంద్ర ప్రభుత్వం ధరలను పెంచకపోతే ఓటుతో సమాధానం ఇస్తాం. -వసంత, తుకారాంగేట్