Petrol price in Hyderabad | కేంద్ర ప్రభుత్వం గత బుధవారం పెట్రోల్పై రూ.5, డీజిల్పై రూ.10 ఎక్సైజ్ డ్యూటీని తగ్గించడంతో దేశవ్యాప్తంగా పెట్రో ధరలు స్వల్పంగా తగ్గాయి. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్పై రూ.6.29 తగ్గుదల నమోదైంది. డీజిల్పై రూ.12.78 తగ్గింది. శుక్రవారం నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ.108.18గా, లీటర్ డీజిల్ ధర రూ.94.62గా ఉన్నది. కాగా, ఈ మధ్య కాలంలో పెట్రో సరైన పద్ధతిలో పెరుగలేదని పెట్రో డీలర్లు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రస్తుతం పెట్రో ధరలు స్వల్పంగా తగ్గినా త్వరలోనే మళ్లీ పెరుగడం ఖాయమని అంటున్నారు.
అంతర్జాతీయ మార్కెట్లలో క్రూడాయిల్ ధర గత కొన్ని రోజుల నుంచి వరుసగా పెరుగుతూ వచ్చిందని, దాంతో దేశంలో పెట్రో ధరలు ప్రతి రోజూ క్రమం తప్పకుండా 10 నుంచి 20 పైసలు పెరిగాయని తెలంగాణ స్టేట్ పెట్రోల్ డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు వినయ్ కుమార్ చెప్పారు. ఇకపై ఇదే కొనసాగుతుందన్నారు. అందుకే కేంద్రం ఎక్సైజ్ సుంకం తగ్గించినందుకు ధరలు ఇప్పుడు స్వల్పంగా తగ్గినా.. క్రూడాయిల్ ధరలు పెరుగుతుండటంతో కొద్ది రోజుల్లోనే మరింత పెరుగుతాయని ఆయన అంచనా వేశారు. కాగా, ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో బ్రెంట్ క్రూడాయిల్ ధర 81.36 అమెరికన్ డాలర్లు పలుకుతున్నది.