నాంపల్లి కోర్టులు, మే 24 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)లో ఏసీబీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న టి.శ్రీరామ ఉమామహేశ్వర్రావును 10 రోజుల కస్టడీకి అప్పగించాలని కోరుతూ ఏసీబీ కోర్టులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ (పీపీ) శుక్రవారం పిటిషన్ను దాఖలు చేశారు. అతిముఖ్యమైన విచారణ మిగిలిపోయిందని, అరెస్టు సమయంలో నిందితుడు తమకు సరైన సమాధానాలు ఇవ్వలేదని పిటిషన్లో పేర్కొన్నారు. సంపాదనకు మించి ఆస్తులను కూడబెట్టిన వివరాలను తెలుసుకునేందుకు అప్పట్లో సమయం సరిపోలేదని తెలిపారు. ఇంకా చాలా ఆస్తులు ఆయన పేరిట, తన కుటుంబ సభ్యులు, బినామీల పేరుతో ఉన్నట్టు ప్రాథమికంగా సమాచారం ఉన్నదని పిటిషన్లో పేర్కొన్నారు. అశోక్నగర్లోని నివాసంలో జరిగిన సోదాల్లో లభ్యమైన స్థిర, చరాస్తులకు సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్ల గురించి నిందితుడి నుంచి వివరాలు సేకరించాల్సి ఉన్నదని వివరించారు.
ఇంకా కొన్ని ఆస్తుల వివరాలను నిందితుడు వివరించలేదని, ఒరిజినల్ డాక్యుమెంట్ల గురించి ఆయన వాంగ్మూలం ఈ కేసుకు కీలకమన్నారు. నిందితుడి ఇంటిలో జప్తు చేసిన ల్యాప్టాప్తో పాటు డైరీ, ఇతర పత్రాల గురించి వెల్లడించేందుకు ఆయన నిరాకరించారన్నారు. వ్యవసాయ భూములు, ప్లాట్ల కొనుగోలు విషయంలో ఎవరితో లావాదేవీలు జరిపిన అంశాలన్నింటినీ నిందితుడి ద్వారా తెలుసుకోవాల్సి ఉన్నదన్నారు. బహుమతుల రూపంలో ఎంత డబ్బులను పొందారన్న వివరాలను తెలుసుకోవాల్సి ఉందన్నారు. కాగా, నిందితుడి తరఫు న్యాయవాదికి నోటీసులు జారీ చేయాలని ఏసీబీ కోర్టు జడ్జి అఫ్రోజ్ అక్తర్ ఆదేశాలు జారీ చేస్తూ..సోమవారానికి విచారణను వాయిదా వేశారు.