సిటీబ్యూరో, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): ఒక్కో బ్యాంకు అకౌంట్కు లక్ష రూపాయల కమీషన్ తీసుకుంటూ సైబర్నేరగాళ్లకు ఇండియన్ బ్యాంకు ఖాతాలు అందిస్తున్న వ్యక్తిని సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. అదనపు సీపీ ఏవీ రంగనాథ్ కథనం ప్రకారం.. పార్ట్టైమ్ జాబ్ పేరుతో నగరానికి చెందిన ఒక వ్యక్తికి రూ. 2,38,405లను మోసం చేయడంతో బాధితుడు సైబర్క్రైమ్ ఠాణాలో ఫిర్యాదు చేశాడు. ఇన్స్పెక్టర్ ఎన్.నరేశ్ నేతృత్వంలోని బృందం కేసు దర్యాప్తు చేపట్టింది. నిందితుడు మహ్మద్ సోయాబ్ బాబ్లు ఖాన్ సైబర్నేరగాళ్లతో చేతులు కలిపాడు.
బాధితుల నుంచి దోచుకున్న సొమ్మును డిపాజిట్ చేయించేందుకు సైబర్ నేరగాళ్లకు కావాల్సిన బ్యాంకు ఖాతాలు అందిస్తున్నాడు. ఇందుకు ఒక్కో ఖాతాకు లక్ష రూపాయలు తీసుకుంటున్నాడు. ఈ వ్యవహారంలో బాధితుడు వేసిన సొమ్ము సోయాబ్ బాబ్లు ఖాన్ ఖాతాలోనూ డిపాజిట్ అయినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. దీంతో నిందితుడిని అరెస్ట్ చేసి అతడి ఖాతాలో ఉన్న రూ. 5 లక్షలు సీజ్ చేశారు. నిందితుడికి దేశ వ్యాప్తంగా 42 కేసులతో సంబంధాలుండగా.. తెలంగాణలో ఆరు కేసులు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.