CV Anand | సిటీబ్యూరో, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ): నూతన సంవత్సరం వేడుకల(31/1 రాత్రి)కు ప్రత్యేక ఈవెంట్స్ నిర్వహిస్తూ అర్ధరాత్రి ఒంటి గంట వరకు కార్యక్రమాలు నిర్వహించే 3 నక్షత్రాలపై హోటళ్లు, బార్లు, క్లబ్బులు, పబ్లు తప్పనిసరిగా 15 రోజుల ముందే అనుమతులు తీసుకోవాలని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ సూచించారు. ఈవెంట్ నిర్వహించే చోట తెలంగాణ పబ్లిక్ సేఫ్టీ(మెజర్స్) ఎన్ఫోర్స్మెంట్ యాక్ట్-2013 కింద తప్పనిసరిగా ఎంట్రీ, ఎగ్జిట్తోపాటు ప్రాంగణమంతా కవరయ్యేలా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని సూచించారు.
నిర్వాహకులు సరైన సెక్యూరిటీని ఏర్పాటు చేయాలని, ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా సరైన ఏర్పాట్లు చేసుకోవాలని, అశ్లీలతకు ఎక్కడ కూడా తావు లేకుండా చేసుకోవాలన్నారు. ఔట్డోర్లో ఉండే సౌండ్ సిస్టమ్స్ రాత్రి 10 గంటలకు బంద్ చేయాలని, ఇండోర్లో ఉండే సౌండ్ సిస్టమ్ వారు అనుమతి తీసుకున్న వాళ్లు ఒంటి గంట వరకు మాత్రమే ఉపయోగించాలని సూచనలు చేశారు.
సామర్ధ్యానికి మించి టికెట్లు జారీ చేయొద్దని, అంతకు మించి వస్తే టికెట్లు జారీ చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని, తద్వారా శాంతి భద్రతల సమస్యలు కూడా తలెత్తుతాయన్నారు. ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలు ఏర్పాటు చేసుకోవాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ డ్రగ్స్ వాడకూడదని, ఈ విషయంలో పార్కింగ్, ఇతర ప్రాంతాల్లో నిర్వాహకులు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఎక్సైజ్ డిపార్టుమెంట్ నిబంధనల మేరకు నిర్ణీత సమయం వరకే మద్యం ఉపయోగించాలని నిర్వాహకులకు సూచనలు చేశారు. ఈవెంట్కు వచ్చే కస్టమర్లు తిరిగి ఇండ్లకు వెళ్లే సమయంలో డ్రైవర్స్, క్యాబ్స్ అందుబాటులో ఉంచాలని, డ్రంక్ అండ్ డ్రైవ్కు కస్లమర్లను దూరంగా ఉంచాలని సూచించారు. అగ్నిమాపక శాఖ ఆదేశాల మేరకు ఫైర్ వర్క్స్ను ఉపయోగించవద్దన్నారు. ఆ రోజు రాత్రి విస్తృతంగా డ్రంక్ అండ్ డ్రైవ్ ఉంటుందని సీపీ తెలిపారు.