బేగంపేట్ : మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆలోచనల మేరకు సమగ్ర నాలా అభివృద్ధితో ముంపు సమస్య ( Flooding problem ) కు శాశ్వత పరిష్కారం లభించనున్నదని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ( Minister Talasani ) పేర్కొన్నారు. సోమవారం ఆయన అధికారులతో కలిసి బేగంపేట్ బ్రాహ్మణవాడిలో పర్యటించి నాలా అభివృద్ధి పనులు పరిశీలించారు.
మంత్రి మాట్లాడుతూ సమగ్ర నాలా (Comprehensive canal ) అభివృద్ధి కార్యక్రమం కింద రూ. 45 కోట్ల వ్యయంతో నాలా అభివృద్ధి చేపట్టినట్టు తెలిపారు. కాలనీల్లోకి వరద నీరు రాకుండా నివారించేందుకు గానూ రిటైనింగ్ వాల్స్ (Retaining Walls) నిర్మాణం నాలాలో పూడికను తొలగిస్తున్నారని చెప్పారు. బ్రాహ్మణవాడిలో సివరేజ్, వాటర్ లైన్ ఏర్పాటు సీసీ రోడ్ల నిర్మాణ పనులు చేపట్టామని వెల్లడించారు.
ఈ నెల చివరి నాటికి బేగంపేట్ (Begampet)బ్రాహ్మణ వాడిలోని సివరేజ్ పైపులైన్ ఏర్పాట్లు, రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. బేగంపేట్ నాలాకు ప్రతి సంవత్సరం వర్షాకాలంలో వచ్చే వరద నీటితో పరిసర కాలనీలలోకి నీరు చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారని చెప్పారు. ఈ కార్యక్రమంలో సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీ శంకర్, ఈఈ సుదర్శన్, వివిధ విభాగాల అధికారులు, బీఆర్ఎస్ నాయకులు శ్రీహరి, నరేందర్రావు, శ్రీనివాస్గౌడ్, అఖిల్, ఆరీఫ్ తదితరులు పాల్గొన్నారు.