సిటీబ్యూరో, జూన్ 25(నమస్తే తెలంగాణ) : జవహర్నగర్ డంపింగ్ యార్డు పరిసర గ్రామాల ప్రజల గుండెలపై ప్రభుత్వ నిర్ణయం మరో కుంపటి రగిల్చినైట్లెంది. ఇప్పటికే జీహెచ్ఎంసీతో పాటు 15 స్థానిక సంస్థల నుంచి జవహర్నగర్కు 10వేల మెట్రిక్ టన్నుల చెత్తను తరలిస్తుండగా.. ఇటీవల మరో 12 మున్సిపాలిటీల నుంచి ఇక్కడకు చెత్తను తరలించేందుకు సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో మరో వెయ్యి మెట్రిక్ టన్నుల చెత్త పోగవుతోంది. ఓ వైపు చెత్త రీసైక్లింగ్ ప్రక్రియ నెమ్మదిగా జరుగుతుండటం.. మరోవైపు స్థలాభావంతో చెత్త డంప్ చేసేందుకు స్థలం లేకపోవడానికి తోడు నూతనంగా మరిన్ని ప్రాంతాల నుంచి చెత్తను తరలిస్తుండటంపై స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. డంపింగ్ యార్డు చుట్టుపక్కల ఉన్న తమ బస్తీల్లో బస్తీలలోకి గాలి, వానకు చెత్త వచ్చి చేరుకుంటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
జవహర్నగర్ డంపింగ్ యార్డులోకి ప్రస్తుతం జీహెచ్ఎంసీతో పాటు 15 స్థానిక సంస్థల పరిధిలోని వ్యర్థాలను తరలిస్తున్నారు. అనధికారికంగా మరిన్ని పాంతాల నుంచి చెత్తను ఇక్కడికి తరలిస్తున్నారు. ఇదంతా కలిసి దాదాపు 10వేల మెట్రిక్ టన్నుల చెత్త డంపింగ్ యార్డులో పోగవుతున్నది. జీహెచ్ఎంసీలో మున్సిపాలిటీలను విలీనం చేయడంతో కొత్తగా మరో 12 మున్సిపాలిటీల చెత్త జవహర్నగర్ డంపింగ్ యార్డులో వచ్చి చేరుతోంది.
విలీన ప్రక్రియ పూర్తవడంతో అధికారులు ఇప్పటికే చెత్తను ఇక్కడికి తరలిస్తున్నారు. జవహర్నగర్కు ప్రస్తుతం వస్తున్న 10వేల మెట్రిక్ టన్నులతో పాటు విలీన మున్సిపాలిటీలకు సంబంధించిన మరో వెయ్యికి పైగా మెట్రిక్ టన్నుల చెత్త వచ్చి చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. ఇప్పటికే భరించలేని దుర్వాసనతో సతమతమవుతున్న బాధిత ప్రజలు చెత్త పెరగనున్న నేపథ్యంలో హడలిపోతున్నారు. ఇప్పటికే డంపింగ్ యార్డు పరిసరాలన్నీ చెత్త గుట్టలతో నిండిపోయాయి. దాదాపు 98 శాతం స్థలంలో చెత్త గుట్టలున్నాయి. కొత్తగా చేరుతున్న 12 స్థానిక సంస్థల చెత్త కూడా ఇక్కడికి తరలిస్తే స్థలం సరిపోకపోవడం వల్ల ఇండ్ల చుట్టూ చేరే ప్రమాదమున్నదని బాధిత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలు ఎంపిక చేసి తమను చెత్త నుంచి విముక్తి కలిగించాలని వేడుకుంటున్నారు.
ఇప్పటికే జవహర్నగర్ పరిసరాల్లోని 20 గ్రామాలకు చెందిన ఐదు లక్షల మంది కాలుష్య కోరల్లో చిక్కుకున్నారు. కొత్తగా వచ్చి చేరుతున్న 12 మున్సిపాలిటీల చెత్త కారణంగా మరికొన్ని గ్రామాలకు కాలుష్యం, దుర్వాసన విస్తరించే ప్రమాదముందని ఆందోళన చెందుతున్నారు. డంపింగ్ యార్డు పరసర ప్రాంతాల్లోని భూములు, చెరువులన్నీ ఇప్పటికే పూర్తిగా కలుషితమయ్యాయి. జలవనరులు మరింత కాలుష్య కాసారాలుగా మారిపోయాయి. జవహర్నగర్ డంపింగ్ యార్డుకు చెత్తను తరలించడం ఆపేసి తమ జీవితాలను రక్షించాలని పరిసర గ్రామాలవారు ప్రభుత్వానిన వేడుకుంటున్నారు. నగరంలోని ఇతర ప్రాంతాల్లో కొత్త డంపింగ్ యార్డులు ఏర్పాటు చేస్తే జవహర్నగర్ డంపింగ్ యార్డుపై ఒత్తిడి తగ్గి చెత్తగుట్టలు తగ్గే అవకాశం ఉందని స్థానికులు ప్రభుత్వాన్ని వేడుకుంటున్నారు. ప్రభుత్వ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.