ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర సర్కారు, సేవల్ని మరింత చేరువ చేస్తున్నది. ఇప్పటికే ప్రతి జిల్లా కేంద్రంలో కార్పొరేట్కు దీటుగా హాస్పిటళ్లను తీర్చిదిద్దడమే కాకుండా, కొత్తగా మెడికల్ కాలేజీలు నిర్మిస్తున్నది. తాజాగా పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పట్టణాల్లో బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నది. రూపాయి ఖర్చు లేకుండా స్థానికంగానే మెరుగైన సేవలు అందుతున్నాయి. దీంతో స్థానికుల నుంచి హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
పహాడీషరీఫ్, జూలై 2 : హైదరాబాద్కు కూతవేటు దూరంలో ఉన్న జల్పల్లి మున్సిపాలిటీలో నిరుపేదలు ఎక్కువగా నివాసముంటున్నారు. వారికి అనారోగ్య సమస్యలు వస్తే దవాఖానలు దూరప్రాంతాల్లో ఉన్నాయి. పెరుగుతున్న జనాభాకు అనుగణంగా దవాఖానలు అందుబాటులో లేకపోవడంతో చిన్న చిన్న క్లినిక్లు, దూర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వారి స్థోమతకు మించి వేలాది రూపాయలు ఖర్చు చేస్తునారు. నిరుపేదల చెంతకే వైద్య సేవలు.. ఉచితంగా మందులు అందజేయాలనే గొప్ప ఆశయంతో సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానల ఏర్పాటు మొదలు పెట్టారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గొప్ప మనసుతో మున్సిపాలిటీ పరిధిలో పేదలకు వైద్యం అందించాలని బస్తీ దవాఖానలు ఏర్పాటు చేయిస్తున్నారు. గతంలో ఏ ప్రభుత్వం పేదల వైద్యం కోసం ఆలోచన చేయలేదని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే సీఎం కేసీఆర్ వైద్యానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారని ప్రజల సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అత్యధికంగా పేదలు నివాసముంటున్న జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చొరవతో కొత్తపేట, శ్రీరామకాలనీ, వాది ఏ సాల్హీన్, పహాడీషరీఫ్లో 4 బస్తీ దవాఖానలు ఏర్పాటు చేశారు. వైద్య సేవలు ప్రారంభమయ్యాయి. ఇటీవలే వాది హుదాలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ప్రతి రోజు ఒక్కో దవాఖానలో 100 మంది వరకు బస్తీ వాసులు వైద్య సేవలను వినియోగించుకుంటున్నారని బాలాపూర్ ఆరోగ్య కేంద్ర సూపర్వైజర్ కె.శ్రీనివాస్ తెలిపారు.
డబ్బులు ఆదా అవుతున్నాయి..
చిన్నపాటి సమస్య వస్తే ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్తే రూ.500 వరకు ఖర్చు అయ్యేది. దూర ప్రాంతాలకు వెళ్లి ప్రైవేట్ దవాఖానాలో చూయించుకోలేక తీవ్ర అనారోగ్యాల బారిన పడేవారు. తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే బస్తీ దవాఖానలు ఏర్పాటు చేసి రూపాయి ఫీజు తీసుకోకుండా పరీక్షించి మందులు అందిస్తున్నారు. మా ఇంటి సమీపంలో ఉన్న వారందరూ బస్తీ దవాఖానలో వైద్యం చేయించుకుంటున్నారు.
– వెంకటయ్య, కొత్తపేట వాసి
సీఎం కేసీఆర్ ఆలోచన చాలా గొప్పది
జల్పల్లి మున్సిపాలిటీ పరిధిలో అధికంగా నిరుపేదలు పేదలు నివాసముంటున్నారు. రోజు రోజుకూ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. ఇలాంటి పరిస్థితుల్లో నిరుపేదలు అనారోగ్యాలకు గురైన సమయంలో స్థానికంగా ఆర్ఎంపీ వైద్యులను సంప్రదించడం, దూర ప్రాంతాల్లో ఉన్న ప్రైవేట్ దవాఖానలకు వెళ్లి వేలాది రూపాయలు ఖర్చు చేయడం వారికి భారంగా ఉంటుంది. బస్తీల్లోని పేదలకు సుస్తయితే నయం చేయడానికి సీఎం కేసీఆర్ గొప్ప ఆలోచన నుంచి పుట్టిందే బస్తీదవాఖాన అన్నారు. వైద్యులు పరీక్షలు నిర్వహించి ఉచితంగా పేదలకు మందులు అందజేస్తున్నారు.
– సబితా ఇంద్రారెడ్డి, విద్యాశాఖ మంత్రి