సిటీబ్యూరో, నవంబరు 7 (నమస్తే తెలంగాణ ): అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఎన్నికల యంత్రాంగం నిఘా మరింత పెంచింది. చెక్పోస్టులు, ఇతర ప్రాంతాల్లో ఎక్కడికక్కడ ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా రూ. 50వేల నగదు దాటితే స్వాధీనం చేసుకుంటున్నారు. ఆధారాలు చూపితే అప్పగింత దిశగా జిల్లా గ్రీవెన్స్ కమిటీ చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగానే ఇప్పటి వరకు రూ. 19,04,31,517 కోట్ల నగదు, ఆభరణాలను విడుదల చేసినట్లు జిల్లా గ్రీవెన్స్ కమిటీ చైర్మన్ మధుసూదన్ మంగళవారం వెల్లడించారు. రూ. 33,95,07,195 విడుదల కోసం 206 దరఖాస్తులు రాగా.. అందులో 181 దరఖాస్తులకు సంబంధించిన రూ. 19,04,31,517 నగదు, ఆభరణాలను విడుదల చేశామన్నారు. రూ. 14,58,65,238లకు సంబంధించిన 19 దరఖాస్తులను ఆదాయపన్ను, కమర్షియల్ ట్యాక్స్ శాఖకు సిఫార్సు చేశామన్నారు. రూ. 32,10,440లకు సంబంధించిన ఆరు దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయని పేర్కొన్నారు. వీటిని పరిశీలించి విడుదల చేయడానికి చర్యలు తీసుకుంటున్నామని జిల్లా ఫిర్యాదుల కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు జిల్లా ఫిర్యాదుల కమిటీ చైర్మన్ మధుసూదన్ తెలిపారు. ఈ సమావేశంలో కమిటీ మెంబర్ సెక్రటరీ శరత్ చంద్ర, జిల్లా ట్రెజరీ అధికారి, డిప్యూటీ డైరెక్టర్ వసుంధర, శానిటేషన్ జాయింట్ కమిషనర్ సంధ్య పాల్గొన్నారు.
ఎన్నికల వేళ.. ప్రతి అంశాన్ని అధికారులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఓటర్లను మభ్యపెట్టేందుకు ఆస్కారం ఉన్న ఏ విషయాన్ని కూడా విస్మరించడం లేదు. వ్యాపారం, వివిధ వస్తువుల కొనుగోళ్లు, బ్యాంకుల్లో నగదు జమ, ఇతర శుభకార్యాలు, అత్యవసర పనుల నిమిత్తం నగదు తీసుకువెళ్తూ అధికారులకు చిక్కుతున్నారు. ఈ తనిఖీల్లో పట్టుబడిన నగదు వివరాలను సంబంధిత అధికారులు గ్రీవెన్స్ కమిటీకి చేరవేస్తున్నారు. సదరు సొమ్ము తిరిగి ఇవ్వాలని బాధితులు గ్రీవెన్స్ కమిటీకి దరఖాస్తు చేసుకోవాలి. ఆ నగదును అవసరాల నిమిత్తం తీసుకువెళ్తున్నట్లు కమిటీ నిర్ధారణకు వచ్చిన తర్వాతే.. తిరిగి ఇచ్చేందుకు రిలీజింగ్ ఆర్డర్ (ఆర్వో) జారీ చేస్తున్నారు. సరైన పత్రాలు ఉంటే జాప్యం లేకుండా ఆర్ఓ తిరిగి ఇచ్చేస్తున్నారు.
చార్మినార్, నవంబర్ 7 : ఎన్నికల సందర్భంగా నిర్వహిస్తున్న తనిఖీల్లో పట్టుబడిన నగదుకు సంబంధించిన పత్రాలు చూపిస్తే తిరిగి ఇచ్చేస్తున్నామని హుస్సేనీ ఆలం ఇన్స్పెక్టర్ సురేందర్ తెలిపారు. మంగళవారం పురాణాపూల్ క్రాస్ రోడ్డు వద్ద నిర్వహించిన తనిఖీల్లో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఓ వ్యక్తి వద్ద రూ.1,52,000 నగదు లభించింది. దీంతో ఆ నగదును స్టేషన్కు తరలించి, విచారణ చేపట్టారు. సదరు వ్యక్తి నగదుకు సంబంధించిన పత్రాలను చూపడంతో తిరిగి ఇచ్చేశామని ఇన్స్పెక్టర్ తెలిపారు. నగదు, నగలు తీసుకువెళ్తున్న ప్రజలు తప్పనిసరిగా తమ వెంట సంబంధిత పత్రాలను ఉంచుకోవాలన్నారు. తనిఖీల సమయంలో పత్రాలను చూపించాలన్నారు.