సిటీబ్యూరో, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): తద్దినం ఉన్నదని భోజనానికి పిలిస్తే.. మీ ఇంట్లో రోజూ ఇట్లనే జరగాలి అన్నడట.. కాంగ్రెసోళ్ల పని కూడ గిట్లనే ఉన్నది. బీఆర్ఎస్ కన్నా మంచిగ చేస్తామని చెప్పాలి కానీ.. ఉన్నదంతా ఊడగొడతం.. ఎల్లమ్మ ఊడగొడితే మల్లమ్మ మాయం చేసిందన్నట్టు.. ధరణిని తీసేస్తామంటే అర్థమేందీ ? కాంగ్రెస్ వస్తే దళారులదే రాజ్యం.. పైరవీకారులదే ప్రపంచం’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర్ రావు అన్నారు.
బుధవారం మహబూబ్నగర్, కొడంగల్ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిలకు మద్దతుగా జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు. కాంగ్రెస్ వస్తే మళ్లీ వీఆర్వోలు..కౌలుదారు కాలమ్లు వస్తయి. ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ తిరగాల్సి వస్తది. ధరణిని తీసేసి భూమాత పెడ్తరట. అది భూ మాతనా? భూ మేతనా ? అని మండిపడ్డారు. ధరణిని తీసేస్తే రైతుబంధు ఎట్ల వస్తది ? రైతు బంధు.. బిచ్చమా.. ఆత్మగౌరవమా ? ఇది రైతులు ఆలోచన చేయాలన్నారు. ఇప్పుడిప్పుడే రైతుల మొఖాలు తెల్లపడుతున్నాయని, రైతు తన సొంత పెట్టుబడితోని వ్యవసాయం చేసుకున్న రోజే బంగారు తెలంగాణ అని… నేను కలగనేది కూడా అదేనన్నారు.
ఏడాదిలోగా పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయించి కొడంగల్ పొలాలకు కృష్ణా జలాలను మళ్ళిస్తానని చెప్పారు. రైతులు బాగుండాలంటే.. బీఆర్ఎస్ ప్రభుత్వమే మళ్లీ రావాలన్నారు. నిరంతరం ప్రజాసంక్షేమానికి, అభివృద్ధికి పాటు పడే బీఆర్ఎస్ అభ్యర్థులనే గెలిపించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ కోరారు. కోస్గిలో జరిగిన కొడంగల్ నియోజకవర్గ ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగిస్తున్న బీఆర్ ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కోస్గిలో జరిగిన కొడంగల్ ప్రజా ఆశీర్వాద సభకు భారీగా హాజరైన ప్రజలు