సిటీబ్యూరో, జనవరి 28 (నమస్తే తెలంగాణ) : గ్రేటర్లో వీధి కుక్కల బెడదతో జనం బెంబేలెత్తుతున్నారు. వాటి కాటుకు గురై ఆస్పత్రులకు వస్తున్న బాధితులు నానాటికీ పెరుగుతున్నారు. నారాయణగూడలోని ఐపీఎంకు కుక్క కాట్లతో దాదాపు 200 మంది బాధితులు క్యూ కడుతున్నారంటే పరిస్థితి తీవ్రత ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. మరోవైపు జీహెచ్ఎంసీ వీధి కుక్కల నియంత్రణను గాలికి వదిలేసింది. తూతూ మంత్రంగా చర్యలు చేపడుతున్నది.
ప్రధానంగా వీధి కుక్కలకు ఏబీసీ (యాంటీ బర్త్ కంట్రోల్ ఆపరేషన్స్), రేబిస్ నివారణ టీకాలు వేయడంలో నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నది. జీహెచ్ఎంసీ పరిధిలో ఏడాది కిందట 5.7 లక్షల కుక్కలు ఉన్నట్లు అధికారులు ప్రకటించారు. 70 శాతం శునకాలకు ఏబీసీ ఆపరేషన్లు పూర్తయినట్లు తెలిపారు. మిగిలిన వాటికి శస్త్రచికిత్సలు జరగాల్సి ఉందన్నారు. అయితే ఇటీవల మేయర్ గద్వాల్ విజయలక్ష్మి అధ్యక్షతన జరిగిన హైలెవల్ కమిటీ సమావేశంలో వీధి కుక్కల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలపై సంబంధిత అధికారులు సరైన సమాధానం చెప్పలేకపోయారు. దీంతో మేయర్తో పాటు అన్ని పార్టీల కార్పొరేటర్లతో ఏర్పాటైన హై లెవల్ కమిటీ సభ్యులు తీవ్ర స్థాయిలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఎండగట్టారు.