గోల్నాక : నిధులను త్వరతగతిన విడుదల చేస్తూ నియోజకవర్గ వ్యాప్తంగా జరుగుతున్న పలు అభివృద్ధి పనులను వేగవంతం చేయడంతో పాటు పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ అధికారులను ఆదేశించారు. సోమవారం గోల్నాకలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జీహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సమావేశంలో నియోజకవర్గంలోని అంబర్పేట, గోల్నాక, బాగ్అంబర్పేట, నల్లకుంట, కాచిగూడ తదితర ఐదు డివిజన్ల పరిధిలోని పలు ప్రాంతాల్లో ప్రస్తుతం జరుగుతున్న పలు అభివృద్ధి పనుల పురోగతిని ఆయన అడిగి తెలుసుకున్నారు. రహదారుల అభివృద్ధి, డివైడర్ల సుందరీకరణ, పార్కుల అభివృద్ధి తదితర పెండింగ్లో ఉన్న పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన అధికారులకు సూచించారు.
దీంతో పాటు కొత్తగా ఏఏ ప్రాంతాల్లో రహదారులు ఏర్పాటు చేయాలో వెంటనే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఆయన సూచించారు. ముఖ్యంగా బాగ్అంబర్పేట డివిజన్లోని వైభవ్నగర్, సోమసుందర్నగర్, రామకృష్ణనగర్ తదితర ప్రాంతాల్లో జరుగుతున్న పార్కుల అభివృద్ధి పనులపై ఎమ్మెల్యే ఆరా తీశారు. ఆయా కాలనీల ప్రజల సూచనలు పరిగణంలోకి తీసుకొని పూర్తి వసతులతో మోడల్ పార్కులుగా అభివృద్ధి చేయాలని సూచించారు.
కుమ్మరివాడీ, బుర్జుగల్లీ, కాచిగూడ డివిజన్ కుత్బిగూడ, చప్పల్బజార్ తదితర ప్రాంతాల్లో కొత్త సీసీ రహదారుల ఏర్పాటు కోసం ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఎమ్మెల్యే సూచించారు. ఆలోపు ఆయా ప్రాంతాల్లో డ్రైనేజీ, మంచినీటి పైప్లైన్ల ఏర్పాటు ఉంటే వెంటనే పనులు పూర్తి చేయాలని ఆదేశించారు.దీంతో పాటు ప్రతి బస్తీ, కాలనీ అనే తేడా లేకుండా ప్రతి రోజూ చెత్తను శుభ్రం చేసేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు.
అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించేలా అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోవాలన్నారు. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ డీఈ సుధాకర్, ఏఈ ప్రేరణ, వర్క్ఇన్స్పెక్టర్ రవి, టీఆర్ఎస్ పార్టీ నాయకులు మహేష్, దిలీప్, అనిల్, సంతోష్ తదితరులు పాల్గొన్నారు.