దుండిగల్, జనవరి 9 : సంక్రాంతి సెలవుల్లో పిల్లల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందని సామాజిక కార్యకర్త కోలా రవీందర్ ముదిరాజు అన్నారు. సోమవారం షాపూర్నగర్ ప్రభుత్వ పాఠశాల, సూరారం నార్త్ సిటీ హైస్కూళ్లలో జాగృతి సంస్థ ఆధ్వర్యం లో విద్యార్థులకు పతంగులను ఎగురవేసే సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా రవీందర్ మాట్లాడుతూ.. సంక్రాంతి సెలవుల్లో చిన్నారులు పతంగులు ఎరురవేయడం ఆనవాయితీగా వస్తుందని, ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. కొందరు వ్యాపారులు చైనా మాంజాలను విక్రయిస్తుండటంతో పిల్లలతో పాటు,వాహనదారులకు వాటితో ప్రాణాపాయం పొంచి ఉందన్నారు.
చైనా మాంజాలను విక్రయించే వ్యాపారులపై పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అదే విధంగా సరదా కోసం పిల్లలు చెరువులో ఈత కొట్టేందుకు నీటిలో దిగకుండా తల్లిదండ్రులు జాగ్రత్తపడాలని,ఎంతో మంది చిన్నారులు చెరువులోకి దిగి ఈతరాక ప్రాణాలు కోల్పోయిన ఘటనలు ఉన్నాయన్నారు. సెలవులకు సొంత ఊళ్లకు వెళ్లే ప్రజలు తమ ఇంట్లో నగదు, విలువైన బంగారు ఆభరణాలు ఉంచకుండా బ్యాంక్లలో భద్రపర్చు కోవాలన్నారు. కార్యక్రమంలో జాగృతి అధ్యక్షురాలు శివపార్వతి, ఎండీ.అఖిల్,అరవింద్, ప్రవీణ్,అనిల్ పాల్గొన్నారు.