రోగులతో కిటకిటలాడుతున్న విభాగాలు
ఉస్మానియా, గాంధీలో నిత్యం 2 వేల మంది రాక
అంతేస్థాయిలో జరుగుతున్న వైద్య పరీక్షలు
ఒక్కో విభాగంలో 20కిపైగా శస్త్రచికిత్సలు
ధర్మాస్పత్రుల్లో సాధారణ వైద్య సేవలు పునరుద్ధరణ
పూర్తిస్థాయిలో ఓపీ, ఐపీ సేవలు
కరోనా అలజడితో ఉస్మానియా, గాంధీ, నిమ్స్ తదితర దవాఖానల్లో రెండేండ్లుగా నిలిచిన సాధారణ వైద్యసేవలను పూర్తిస్థాయిలో పునరుద్ధరించారు. మహమ్మారి ఉద్ధృతి పూర్తిగా తగ్గడంతో అన్ని ప్రభుత్వ ఆస్పతుల్లో అవుట్ పేషెంట్(ఓపీ) విభాగాలు రోగులతో రద్దీగా మారుతున్నాయి. ఓపీతోపాటు ఇన్పేషెంట్(ఐపీ) విభాగాలు నిండిపోతున్నాయి. ప్రస్తుతం కొవిడ్ ఆంక్షలు ఎత్తివేయడం, జనజీవనం సాధారణ స్థితికి రావడంతో ధర్మాస్పత్రులకు నిత్యం 2 వేల మంది వస్తున్నారు. గ్రేటర్ పరిధిలోని ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్జే, కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, ఎర్రగడ్డ ఛాతి దవాఖానలతోపాటు ప్రధాన టీచింగ్ ఆస్పత్రుల్లో ఐపీ రోగుల సంఖ్య భారీగా పెరిగింది. వీటిల్లో అత్యవసర శస్త్రచికిత్సలతోపాటు ఎలక్టివ్ చికిత్సలను కూడా పునరుద్ధరించారు. వాతావరణ మార్పులతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నవారు, కిడ్నీ, జనరల్ మెడిసిన్, ఆర్థో, కార్డియో, గ్యాస్ట్రో, యూరాలజీ, డెర్మటాలజీ తదితర విభాగాలు కిటకిటలాడుతున్నాయి.
సిటీబ్యూరో, మార్చి 27 : కరోనా అలజడి సృష్టించిన రెండేండ్ల తరువాత గాంధీ, ఉస్మానియా తదితర సర్కార్ దవాఖానల్లో ఓపీ, ఐపీ సేవలు పూర్తిస్థాయికి చేరుకున్నాయి. కరోనాకు పూర్వం మాదిరిగానే అన్ని దవాఖానల్లో సాధారణ పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఉస్మానియా, గాంధీలో కరోనాకు ముందు ప్రతి రోజూ 2000 మందికి పైగా రోగులు ఓపీ సేవలు పొందేవారు. కరోనా సమయంలో ఈ సంఖ్య రెండు మూడు వందలకు పడిపోయింది. తొలిదశలో అయితే ఏకంగా కొన్ని రోజులపాటు ఓపీ సేవలను పూర్తిగా నిలిపివేశారు. అత్యవసర సేవలను మాత్రమే అందించారు.
ఇక గాంధీ దవాఖాన పూర్తిగా కొవిడ్ కేర్ సెంటర్గా మారడంతో అక్కడ కరోనా రోగులకు మాత్రమే చికిత్స అందించారు. సెకండ్వేవ్ తరువాత నెమ్మదిగా పరిస్థితులు కుదటపడటంతో గాంధీలో నాన్కొవిడ్ సేవలనూ పున:ప్రారంభించారు. మొత్తానికి ఈ నెల 22తో లాక్డౌన్కు రెండేండ్లు పూర్తయ్యాయి. గత నవంబర్, డిసెంబర్లో థర్డ్వేవ్ ఒమిక్రాన్ రూపంలో దూసుకువచ్చినా అది పెద్దగా ప్రభావం చూపలేదు. దీంతో గ్రేటర్ పరిధిలోని అన్ని కేటగిరీలకు చెందిన దవాఖానలు పూర్తిస్థాయిలో సేవలు అందించడం ప్రారంభించారు.
అత్యవసర శస్త్రచికిత్సలతో పాటు ఎలక్టివ్ శస్త్రచికిత్సల సంఖ్యను సైతం పునరుద్ధరించాయి. దీంతో ఉస్మానియా, గాంధీ, నిలోఫర్, ఎంఎన్జే, కోఠి ఈఎన్టీ, నల్లకుంట ఫీవర్ హాస్పిటల్, ఎర్రగడ్డ ఛాతి దవాఖాన తదితర ప్రధాన టీచింగ్ హాస్పిటల్స్లో ఐపీ (ఇన్పేషెంట్స్) రోగుల సంఖ్య పెరిగింది. దీంతో ప్రతి రోజూ ఓపీ రోగులతో పాటు ఐపీ రోగుల సంఖ్య అయా దవాఖానల సామర్థ్యానికి మించి నమోదవుతున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
పెరిగిన వైద్యపరీక్షలు
ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో వైద్యపరీక్షలు కూడా అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. అన్ని రకాల రక్తపరీక్షలు ప్రతిరోజూ కనీసం వెయ్యి మందికి పైగా జరుపుతున్నట్లు అధికారులు తెలిపారు. అల్ట్రాసౌండ్ రోజుకు 40-50మందికి, ఎంఆర్ఐ ప్రతి రోజు 20-30మందికి, క్యాథలాబ్ పరీక్షలు ప్రతి రోజు 20నుంచి 30మందికి నిర్వహిస్తున్నట్లు వైద్యాధికారులు తెలిపారు.
2000దాటిన ఓపీ రోగుల సంఖ్య
ఉస్మానియా, గాంధీ దవాఖానల్లో ఓపీ రోగుల సంఖ్య ప్రతి రోజూ 2000 నుంచి 3000వరకు నమోదవుతున్నట్లు వైద్యాధికారులు వెల్లడించారు. అధికంగా కిడ్నీ, జనరల్ మెడిసిన్, ఆర్థో, కార్డియో, గ్యాస్ట్రో, యూరాలజీ, డెర్మటాలజీ తదితర విభాగాలకు సంబంధించి రోగులు ఓపీ, ఐపీ సేవలు పొందుతున్నట్లు ఉస్మానియా దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ నాగేందర్, గాంధీ సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు. ఒక్కో విభాగంలో శస్త్రచికిత్సలు కనీసం 20కి పైగా జరుగుతున్నట్లు తెలిపారు.