మూసాపేట,జూన్11: దశాబ్దలుగా అభివృద్ధికి నోచుకోని పార్కులు తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతున్నాయి. పార్కు స్థలాలను గుర్తించడంతో పాటు ప్రజలకు ఆహ్లాదం పంచేలా ఆధునికరిస్తున్నారు. కూకట్పల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, మూసాపేట మాజీ కార్పొరేటర్ తూము శ్రావణ్కుమార్ ప్రత్యేక శ్రద్ధతో మూసాపేట డివిజన్ పరిధిలోని పాండురంగనగర్ కాలనీ పార్కు-1 ఇందుకు నిదర్శంగా నిలుస్తున్నది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి 9 వరకు, సాయంత్రం 4గంటల నుంచి 8 వరకు పార్కును తెరుస్తారు. ఒక సారి పార్కులో అడుగుపెట్టిన దగ్గర నుంచి తిరిగి పార్కును వదలేసి వచ్చే వరకు పుదోటలో విహరిస్తున్నట్టుగా ఉంటుందని పార్కును సందర్శించిన వారు చెబుతారు. ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ పచేసుకోవడానికి వాకింగ్ ట్రాక్, పచ్చదనం పెంచే మొక్కలు, చిన్నారులు ఆడుకునేందుకు కీడ్రా వస్తువులు ఏర్పాటు చేశారు. యువత జిమ్ చేసుకోవడానికి ఓపెన్ జిమ్ను సైతం ఏర్పాటు చేశారు. దీంతో మొన్నటి వరకు కళాహీనంగా ఉండే పార్కులు ఇప్పుడు కొత్త కళను సంతరించుకున్నాయి.
కుటుంబ సమేతంగా..
చిన్నా పెద్దా తేడా లేకుండా ఉదయం, సాయంత్రం వేళల్లో వాకింగ్ చేసుకుంటూ ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారు. సెలవు దినాల్లో కుటుంబ సమేతంగా పిల్లలతో కలసి పార్కులో సేదతీరుతున్నారు. పార్కులో సువాసనలు ఇచ్చే పూలమొక్కలు, నీడనిచ్చే భారివృక్షాలు పచ్చదనం ఉండడంతో సందర్శకుల సంఖ్య పెరుగుతున్నది. పార్కులో అడుగు పెట్టగానే ఆకర్శణీయమైన కుర్చీలు దర్శనమిస్తాయి.
ఆటా..పాట అక్కడే ..
పార్కులో రోజు ఆడుకుంటున్నాము. సాయంత్రం సెలవు రోజుల్లో నా సమయమంతా అక్కడే గడుపుతున్నాను. కరోనా సమయంలో ఇంట్లోనే నాలుగు గోడల మధ్య ఆడుకోవాల్సి వచ్చేంది. ఇప్పుడు ఆ ఇబ్బంది లేదు. నాతో పాటు చాలా మంది పిల్లలు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆడుకుంటున్నాము.
– సాయిశ్లేష (విద్యార్థిని)
ఓపెన్ జిమ్ను వినియోగించుకుంటున్నాం
అభివృద్ధి నోచుకుని పార్కులు తెలంగాణ ప్రభుత్వంలో అభివృద్ధి చెందుతున్నాయి. గతంలో కాలనీలోని పార్కు అనేక సమస్యలతో అధ్వానంగా ఉండేది. పార్కును అభివృద్ధి చేయాలని గతంలో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కృషి వల్ల అభివృద్ధి చేందడంతో చుట్టుపక్కల కాలనీవాసులు పార్కుకు వస్తున్నారు. యువత కోసం ఓపెన్ జిమ్ ఏర్పాటు చేయడం అభినందనీయం.
– శ్రీకాంత్ స్థానికుడు