Kendriya Vidyalaya | కొండాపూర్, మార్చి 3 : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ క్యాంపస్లో కొనసాగుతున్న కేంద్రీయ విద్యాలయ స్కూల్ వచ్చే విద్యా సంవత్సరం నుంచి మూతపడనుంది. స్కూల్ కొనసాగింపు మాతో కాదంటూ ఇప్పటికే యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేయగా, స్కూల్ కొనసాగింపుపై స్పష్టత ఇవ్వకుండా మీనామేషాలు లెక్కపెడుతున్నది. కేంద్రీయ విద్యాలయ సంఘటన్. కాగా, స్కూల్లో విద్యనభ్యసిస్తున్న 7,8,9వ తరగతుల విద్యార్థుల భవిష్యత్తేంటని విద్యార్థులతో పాటు తల్లిదండ్రుల్లో గుబులు మొదలయింది. ఇన్ని సంవత్సరాలుగా విద్యనభ్యసిస్తున్న తమ పిల్లల స్కూల్ ఈ ఏడాదితో మూతపడనుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. మరో మూడేండ్ల పాటు స్కూల్ను కొనసాగించాలంటూ ఇప్పటికే తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ఢిల్లీలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్, నగరంలోని కేవీ కమిషనర్లకు వినతి పత్రాలను సైతం అందజేశారు. ఈ ఏడాదితో స్కూల్ను శాశ్వతంగా మూసివేస్తున్నట్లు వర్సిటీ యాజమాన్యం ఫైనల్ ఉత్తర్వులను సైతం జారీ చేసినట్లు తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కేవీని మూసివేస్తున్నట్లు యూనివర్సిటీ ఉత్తర్వులు జారీ చేయడంతో శుక్రవారం విద్యార్థులు, తల్లిదండ్రులు క్యాంపస్ ప్రధాన ద్వారం ముందు ఆందోళనకు దిగారు. క్యాంపస్లోని స్కూల్ను కొనసాగించాలని లేదంటే మరో కేవీ స్కూల్లో విద్యార్థులందరికి అడ్మిషన్లను ఇప్పించాలంటూ డిమాండ్ చేశారు. ఇప్పటికే కేవీఎస్తో పాటు నగరంలోని కమిషనర్ కార్యాలయానికి లేఖలు పంపినట్లు తెలిపారు.
గచ్చిబౌలిలోని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ 2013-14 సంవత్సరంలో ప్రాజెక్ట్ ఒప్పందంతో పదేండ్ల పాటు క్యాంపస్లో కేవీ స్కూల్ను నడిపేందుకు ఏర్పాటు చేసింది. కాగా ఈ ఏడాది గడువు ముగియనుండడంతో స్కూల్ను ఇకపై నడపలేమంటూ ఉత్తర్వులను జారీ చేసింది. స్కూల్ నిర్వహణకు ప్రతి సంవత్సరం రూ. 2కోట్లు ఖర్చు అవుతుందని, ఇకపై వర్సిటీ భరించలేదంటూ తెలియజేసింది.