వంద జరిమానాలు
పంజాగుట్ట పీఎస్ పరిధిలో బ్లాక్ ఫిల్మ్ డ్రైవ్
ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ స్టిక్కర్లపై ప్రత్యేక దృష్టి
ఖైరతాబాద్, మార్చి 26 : కేంద్ర మోటార్ వెహికిల్ చట్టం ప్రకారం ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న వాహనాలపై ట్రాఫిక్ పోలీసులు కొరడా ఝులిపిస్తున్నారు. నల్ల ఫిల్మ్లు పెట్టుకోవడం, వివిధ హోదాలను సూచిస్తున్న స్టిక్కర్లు కలిగిన వాహనాలపై సైతం దృష్టి సారిస్తున్నారు. తాజాగా బ్లాక్ ఫిల్మ్ డ్రైవ్ కార్యక్రమం చేపట్టగా, పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ పరిధిలో ముమ్మరం కొనసాగుతున్నది. ప్రధాన కూడళ్లలో పోలీసులు బ్లాక్ ఫిల్మ్లు తొలగించడంతో పాటు వారికి జరిమానా కూడా విధిస్తున్నారు.
నల్ల ఫిల్మ్…ఫ్యాన్సీ నంబర్లపై ఆరా
కార్లు, జీపులు, ఇతర నాలుగు చక్రాల వాహనాల అద్దాలకు నల్లరంగు ఫిల్మ్లు పెట్టుకున్న వారికి నిబంధనల ప్రకారం జరిమానాలు విధిస్తున్నారు. ఒక్కో కారుకు రూ.700 చొప్పున జరిమానా వేస్తున్నారు. పంజాగుట్ట ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇప్పటి వరకు సుమారు 150 కార్లకు జరిమానా వేసినట్లు తెలిపారు. వీటితో పాటు ఫ్యాన్సీ నంబర్లపై దృష్టి సారిస్తున్నారు. ఉదాహరణకు ఒక్కో వాహనాన్ని నాలుగు అక్షరాలు, ఆరు అంకెలతో రిజిస్ట్రేషన్ ఉంటుంది. అయితే అంకెల విషయానికి వస్తే చివరి నాలుగు అంకెల్లో ఒక్కటి మాత్రమే పెట్టుకోవడం, మొత్తానికి కలిపి ఒకే నంబరు డిస్ప్లే చేయడం లాంటివి చేస్తే వారికి రూ.135 చొప్పున జరిమానా విధిస్తున్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే స్టిక్కర్లపై ప్రత్యేక డ్రైవ్
నల్ల ఫిల్మ్తో పాటు వాహనాలపై వివిధ హోదాలతో కూడిన స్టిక్కర్లపై ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నాం. కార్లు, బైకుల విండ్ షీల్డ్లపై ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్, ప్రభుత్వ వాహనం, ఆర్మీ, పోలీస్, ప్రెస్, ఇతర సంస్థలకు సంబంధించిన స్టిక్కర్లు వేసుకుంటే ఎంవీ యాక్ట్ ప్రకారం ప్రకారం తొలగిస్తున్నాం.అయితే ప్రస్తుతం ప్రజాప్రతినిధులు కొనసాగుతున్న వారు, ఆయా హోదాలో ఉన్న వారికి మినాహయింపు ఇస్తున్నాం. – మధుసూదన్, ట్రాఫిక్ సీఐ, పంజాగుట్ట