ఖైరతాబాద్/మియాపూర్, డిసెంబర్ 26: ప్రజాభవన్ వద్ద బారికేడ్ను ఢీకొట్టిన ఘటనలో ప్రధాన నిందితుడిగా బోదన్ మాజీ ఎమ్మెల్యే షకీల్ కుమారుడు సొహెల్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అతడిపై కేసు నమోదు చేశారు. ఈ నెల 24న అర్ధరాత్రి ప్రజాభవన్ వద్ద తన కారుతో బారికేడ్ను గుద్దడంతో అది ధ్వంసమైంది. ఈ ఘటనపై పంజాగుట్ట పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. అయితే, ఇన్స్పెక్టర్ దుర్గారావు ఈ కేసులో ఉదాసీనంగా వ్యవహరించారన్న ఆరోపణల నేపథ్యంలో వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగారు. కేసు దర్యాప్తు చేపట్టి.. సొహెల్ ఈ కేసును తప్పుదోవ పట్టించేందుకు అతడి ఇంట్లో పనిచేస్తున్న ఓ వ్యక్తిని పోలీసుల ఎదుట ప్రవేశపెట్టాడని, అతడిని కోర్టులో హాజరు పరుస్తామని డీసీపీ తెలిపారు. కాగా, ఈ ఘటనపై ఇన్స్పెక్టర్ దుర్గారావు ఉదాసీనంగా వ్యవహరించాడన్న ఆరోపణలు, ప్రాథమిక విచారణ అనంతరంపై అతడిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈ మేరకు హైదరాబాద్ సీపీ ఆదేశాలు జారీ చేశారు.
అవినీతి ఆరోపణలు, మహిళతో అక్రమ సంబంధం ఆరోపణలపై మియాపూర్ ఠాణాలో పని చేస్తున్న ఓ ఎస్ఐపై సస్పెన్షన్ వేటు పడింది. మియాపూర్ సెక్టర్ ఎస్ఐగా పని చేస్తున్న గిరీశ్ కుమార్ విధి నిర్వహణలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. పోకిరీల వేధింపుల నుంచి రక్షణ నిమిత్తం ఠాణాకు వచ్చిన ఓ మహిళను కేసు విచారణ విషయమై సదరు ఎస్ఐ తరచుగా తిప్పించుకుంటున్నాడు. న్యాయం చేస్తానని నమ్మబలికి సదరు మహిళను లోబర్చుకున్నట్లు ఆరోపణలున్నాయి. ఎస్ఐ తన పట్ల అనుచితంగా ప్రవర్తించినట్టు బాధిత మహిళ రెండు రోజుల కిందట సీపీకి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. దీనిపై విచారణ చేసిన ఉన్నతాధికారులు అనుచిత ప్రవర్తనను నిర్ధారించుకొని మంగళవారం సాయంత్రం గిరీశ్ను సస్పెండ్ చేశారు.