నిర్లక్ష్యం చేస్తే చర్యలు
ప్రణాళికగా కృషి చేయాలి
జిల్లా కలెక్టర్ హరీశ్
మేడ్చల్ రూరల్, మే 26 : పట్టణ, పల్లె ప్రగతిని నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ హరీశ్ అధికారులను హెచ్చరించారు. పల్లె, పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలను విజయవంతం చేయడానికి ప్రణాళికగా ముందుకెళ్లాలన్నారు. వచ్చే నెల 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న సందర్భంగా గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు హరితహారం కార్యక్రమాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేపడుతున్న కార్యక్రమాలను విజయవంతం చేయడాన్ని సవాల్గా స్వీకరించాలన్నారు. పల్లె, పట్టణ ప్రగతి, హారిహారం కార్యక్రమాలకు సంబంధించి అధికారులు చేపడుతున్న కార్యక్రమాలకు సంబంధించి పూర్తి నివేదికలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, ముఖ్యమంత్రి ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని తెలిపారు. ప్రణాళిక రూపొందించుకొని, ప్రజాప్రతినిధులను కలుపుకొని పనులు చేయాలని అధికారులకు సూచించారు. జిల్లా వ్యాప్తంగా వైకుంఠధామాల చుట్టూ బయో ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని, నీటి సౌకర్యం ఉండేలా చూడాలన్నారు. లేకుంటే ఆర్డబ్ల్యూఎస్ అధికారులను సంప్రదించి, ఏర్పాటు చేయాలన్నారు.
ఉత్తమ, అధమ పంచాయతీల గుర్తింపు..
పల్లె ప్రగతి, పట్టణ ప్రగతితో పాటు హరిహారం కార్యక్రమాలకు సంబంధించి జిల్లా నుంచి మూడు ఉత్తమ, మూడు అధమ పంచాయతీలను గుర్తించనున్నట్టు కలెక్టర్ తెలిపారు. మున్సిపాలిటీల్లో గ్రీన్ బడ్జెట్ను వాడుకోవాలని, మల్టీలేయర్ ప్లాంటేషన్ చేపట్టాలని సూచించారు. పట్టణ, పల్లె ప్రగతి కార్యక్రమాలను ముఖ్యమంత్రి కార్యాలయానికి చెందిన సీనియర్ అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తారని, అధికారులు బాధ్యతాయుతంగా ఉండాలన్నారు. జిల్లా వ్యాప్తంగా డంపింగ్యార్డులను పూర్తి చేయాని తెలిపారు. మండలాల వారీగా క్రీడా ప్రాంగణాల పనులు ప్రారంభించి, జూన్ 2వ తేదీన సంబంధిత ప్రజాప్రతినిధులతో ప్రారంభోత్సవాలు చేయించాలని అధికారులను ఆదేశించారు. అలాగే గ్రామ గ్రామాన సూచిక బోర్డులను ఏర్పాటు చేయాలన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీ కమిషనర్లు, ఎంపీడీవోలు కింది స్థాయి అధికారులు ప్రణాళికలు రూపొందించుకొని, కలిసి పని చేయాని సూచించారు. అనంతరం కమిషనర్లు, ఎంపీడీవోలను వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ శ్యాంసన్, డీఆర్డీఏ పీడీ పద్మజారాణి, డీపీవో రమణమూర్తి, జిల్లా అటవీ శాఖ అధికారి అశోక్కుమార్, ఆయా మండలాల ఎంపీడీవోలు, మున్సిపల్ కమిషనర్లు, సంబంధిత శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
భూసార పరీక్షల సాగుకు రైతులను సమాయత్తం చేయాలి
మేడ్చల్ రూరల్, మే 26 : సాగులో మండల వ్యవసాయ అధికారులు, వ్యవసాయ విస్తరణ అధికారులు కీలకపాత్ర పోషించాలని జిల్లా కలెక్టర్ హరీశ్ అన్నారు. భూసారం ఆధారంగా పంటలను సాగు చేసేలా రైతులను సమాయత్తం చేయాలని సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో గురువారం వానకాలం సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా గ్రామాల్లో ఏవోలతో పాటు ఏఈవోలు భూసార పరీక్షలు చేపట్టి, రైతులకు ఆ భూమిలో ఏ పంట వేస్తే దిగుబడి అధికంగా వస్తుందనే వివరాలు చెప్పాలన్నారు. క్షేత్ర స్థాయిలో పొలాలను పరిశీలించి, రైతు సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు. పంట మార్పిడి వల్ల కలిగే లాభాలు, ప్రత్యామ్నాయ పంటల సాగుపై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జిల్లా అదనపు కలెక్టర్ శ్యాంసన్, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి మేరీరేఖ, వ్యవసాయ శాఖ అదనపు డైరెక్టర్లు, ఏవోలు, ఏఈవోలు పాల్గొన్నారు.