Padma Rao Goud | ఉస్మానియా యూనివర్సిటీ, ఏప్రిల్ 15: పూల జల్లులు.. మంగళహారతులు.. ఇలా అడుగడుగునా..అపూర్వ స్వాగతాల నడుమ పజ్జన్న పాదయాత్ర ఉత్సాహంగా సాగింది. ప్రతిసారీ తనకు అచ్చొచ్చిన పార్సీగుట్ట నుంచే సోమవారం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి పద్మారావుగౌడ్ తన ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు. తొలుత పార్టీ పతాకాన్ని ఆవిష్కరించిన ఆయన.. అనంతరం బౌద్ధనగర్ డివిజన్లో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలతో కలిసి పాదయాత్ర చేశారు. ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థించారు. పజ్జన్న పాదయాత్రకు బ్రహ్మరథం పట్టిన ప్రజలు.. జై తెలంగాణ నినాదాలతో హోరెత్తించారు. ఆడపడుచులు హారతులు ఇచ్చి..కారు గుర్తుకే మా ఓటు అంటూ.. స్వచ్ఛందంగా మద్దతు తెలిపారు.
పార్సీగుట్ట, సంజీవపురం, అశోక్నగర్, మధురానగర్ తదితర ప్రాం తాల్లో పర్యటించిన పద్మారావు ఈ సందర్భంగా మాట్లాడారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఓటర్లను కోరారు. మల్టీపర్పస్ ఫంక్షన్ హాళ్లు, తుకారాంగేట్ ఆర్యూబీ నిర్మాణం, సీతాఫల్మండిలో జూనియర్, డిగ్రీ కళాశాలల ఏర్పాటు, మంచినీటి ఎద్దడి నివారణ, సీవరేజ్ సమస్యల పరిష్కారం.. ఇలా పదేండ్లలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలతో సికింద్రాబాద్ నియోజకవర్గాన్ని అగ్రస్థానంలో నిలిపానని గుర్తు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో తనకు ఏ విధంగా అండగా నిలిచారో.. ఇప్పుడు పార్లమెంటు ఎన్నికల్లోనూ మద్దతు ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.