సిటీబ్యూరో, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పార్టీకి 50 ఏండ్లు అధికారం ఇస్తే ఏం చేసిందో చెప్పాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ డిమాండ్ చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు మేలు చేయలేన్నోళ్లు ఇప్పుడు కొత్తగా గ్యారెంటీ, వారంటీ అంటూ వస్తున్నారని మండిపడ్డారు. సనత్నగర్ నియోజకవర్గంలో గడపగడపకు పాదయాత్ర కార్యక్రమంతో మంత్రి తలసాని కాంగ్రెస్, బీజేపీ పార్టీల తీరును ఎండగట్టారు.
ఎన్నికలు వచ్చినప్పుడే కాంగ్రెస్, బీజేపీ నేతలకు ప్రజలు గుర్తుకువస్తారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి బీజేపీ నేతలు తెలంగాణ రాష్ర్టానికి ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో ఇక్కడి నుంచి గెలుపొంది ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా, మంత్రులుగా చేసిన వారు సైతం చేయలేని అభివృద్ధి పనులను రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ సహకారంతో చేసినట్లు చెప్పారు. ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని, మూడవ సారి రాష్ట్రంలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.