కింగ్ కోఠి జిల్లా దవాఖానలో సహజ ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్
సాధారణ వాయువు నుంచి ప్రతి నిమిషానికి 960 లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి
సుల్తాన్బజార్, ఏప్రిల్ 9: కొవిడ్ కారణంగా రోగులకు ఆక్సిజన్ అవసరం పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం వెంటనే స్పందించి దవాఖానలలో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నది. అయితే చాలా దవాఖానల్లో ఆక్సిజన్ పడకలపై వైద్య చికిత్సలు పొందుతున్న రోగులకు లిక్విడ్ ఆక్సిజన్ను అందిస్తున్నారు. తాజాగా తక్కువ ఖర్చులో ఆరోగ్యకర ఆక్సిజన్ అందించడంలో భాగంగా సహజ పద్ధతిలో ఉత్పత్తి అయ్యే ఆక్సిజన్ను రోగులకు అందించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీఓ) శాఖ ఆధ్వర్యంలో దవాఖానలో ఏర్పాటు చేసిన సహజ వాయువు ఎంతగానో ఉపయోగంలోకి వచ్చింది.
తెలంగాణ వైద్య విధాన పరిషత్ కింగ్కోఠి జిల్లా దవాఖానలో మొట్టమొదటగా ప్రత్యేకంగా ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి, ప్రకృతి నుంచి సహజ ఆక్సిజన్ ఉత్పత్తిని ప్రారంభించారు. దీనిని రోగులకు అందుబాటులోకి తీసుకువచ్చి లిక్విడ్ ఆక్సిజన్ వాడకాన్ని తగ్గించడంలో దవాఖాన పాలక వర్గం విశేషంగా కృషి చేస్తున్నది. కింగ్ కోఠి జిల్లా దవాఖానలో రోగుల సౌకర్యార్ధం 350 పడకలకుగాను 13 కిలో లీటర్ల లిక్విడ్ ఆక్సిజన్ ప్లాంట్ను అందుబాటులో ఉంది. ప్రస్తుతం దవాఖానలో అందుబాటులోకి వచ్చిన ఆక్సిజన్ జనరేటర్తో 40 శాతం వరకు ఖర్చును ఆదా చేస్తు న్నట్లు దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.
ఐదు దశల్లో సహజ ఆక్సిజన్
దవాఖాన ఆవరణలో అందుబాటులో ఉన్న ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్లో ఐదు దశలు ఉంటాయి. ఇందులో ప్రధానంగా ఎయిర్ కంప్రెషర్, ఎయిర్ డ్రయర్, ఎయిర్ ట్యాంక్, ఆక్సిజన్ జనరేటర్, ఆక్సిజన్ ట్యాంక్లు ఉంటాయి. తొలిగా ప్రకృతి నుంచి సహజంగా వస్తున్న గాలిని ఇందులోని ఎయిర్ కంప్రెషర్ తీసుకుంటుంది. తదనంతరం ఆ వాయువును ఎయిర్ డ్రయర్లోకి పంపి, అక్కడ నుంచి ఎయిర్ ట్యాంక్లోకి గాలి చేరుతుంది.అక్కడి నుంచి ఆక్సిజన్ జనరేటర్కు వెళ్లి ఆక్సిజన్ ట్యాంక్ లోకి చేరుతుంది. ఈ విధంగా ఐదు దశల్లో సహజ వాయువును పద్ధతి ప్రకారం నిర్వహించి ఆక్సిజన్ను ఉత్పత్తి చేస్తారు. ఆక్సిజన్ జనరేటర్ ప్రతి నిమిషానికి 960 లీటర్ల ఆక్సిజన్ను సాధారణ వాయువు నుంచి ఉత్పత్తి చేయడం గమనార్హం.