గచ్చిబౌలి నుంచి శంషాబాద్ వరకు ఉన్న ఔటర్ రింగు రోడ్డుపై ట్రాఫిక్ రద్దీ విపరీతంగా పెరిగింది. సుమారు 24 కి.మీ దూరం ఉన్న ఈ మార్గంలో రెండు మూడు చోట్లలోనే ఇంటర్ చేంజ్లను నిర్మించారు. ముఖ్యంగా గచ్చిబౌలి నుంచి ప్రారంభమయ్యే ఓఆర్ఆర్పై నానక్రాంగూడ వద్ద వాహనాలు పైకి వెళ్లేందుకు, దిగేందుకు ర్యాంపులను నిర్మించారు. ఆ తర్వాత మళ్లీ సుమారు 7-8 కి.మీ దూరంలో టీఎస్ పోలీస్ అకాడమీ వద్ద, రాజేంద్రనగర్ సమీపంలోని వాలంతరి, శంషాబాద్ వద్ద మాత్రమే నిర్మించారు. కానీ ఐటీ కారిడార్లో అత్యంత కీలకమైన ప్రాంతాలైన కోకాపేట, నార్సింగి ప్రధాన రహదారి మీదుగా వెళ్లే ఔటర్ రింగు రోడ్డు పైకి వాహనాలు వెళ్లేందుకు వీలుగా ఇంటర్చేంజ్ను గానీ, ర్యాంపులను గానీ నిర్మించలేదు. దీంతో సర్వీసు రోడ్లపై 7-8 కి.మీ దూరం వెళ్లి ఓఆర్ఆర్ పైకి వెళ్లాల్సి వస్తున్నది.
నార్సింగి, కోకాపేట, పుప్పాల్గూడ, మణికొండ, మంచిరేవుల ప్రాంతాల్లో రద్దీ గణనీయంగా పెరిగింది. దీంతో నార్సింగి జంక్షన్ వద్ద ఔటర్ రింగు రోడ్డు ఇంటర్ చేంజ్ నిర్మించాలని హెచ్ఎండీఏ నిర్ణయించింది. ఇందులో భాగంగానే నార్సింగి వద్ద ఉన్న మూసీ నదిపై ఓఆర్ఆర్ పైకి ఎక్కేందుకు, దిగేందుకు వీలుగా ర్యాంపులను నిర్మిస్తున్నారు.
ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ తీవ్ర ప్రభావం చూపుతున్నది. అయినా హెచ్ఎండీఏ అధికారులు ఔటర్ రింగు రోడ్డుపై నార్సింగి వద్ద చేపట్టిన ఇంటర్చేంజ్ పనులను నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. నిర్ణయించిన గడువులోగా నిర్మాణ పనులు పూర్తి చేస్తామని అధికారులు పేర్కొంటున్నారు. ఇక్కడ మూసీ నది ఉండటంతో కాజ్వే పద్ధతిలో శంషాబాద్ వైపు వెళ్లేందుకు వీలుగా నిర్మాణాలు చేపడుతున్నారు. ఇవి పూర్తయితే మూసీ నది మీదుగా నిర్మిస్తున్న కాజ్వే, ర్యాంపు మీదుగానే ఓఆర్ఆర్పైకి వాహనాలు వెళుతాయి. ప్రస్తుతం మూసీ వద్ద చేపడుతున్న పనులకు ఎలాంటి ఆటంకం లేకపోయినా వర్షా కాలంలో మాత్రం గండిపేట నుంచి వచ్చే వరదతో పనులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉందని, అందుకే త్వరితగతిన పూర్తి చేయాలన్న లక్ష్యంతో అధికారులు దగ్గరుండి పనులు పర్యవేక్షిస్తున్నారు.
నార్సింగి వద్ద ఓఆర్ఆర్పై ఇంటర్చేంజ్ నిర్మాణం పూర్తయితే శంషాబాద్ నుంచి వచ్చే వాహనాలు నానక్రాంగూడ వరకు వెళ్లకుండా నార్సింగి వద్దే దిగితే ఎంతో సౌకర్యవంతంగా మారుతుంది. విమానాశ్రయం వెళ్లాలన్నా, ఇతర జిల్లాలు, రాష్ర్టాలకు వెళ్లాలన్నా ఔటర్ రింగు రోడ్డు ఎంతో అనుకూలంగా ఉండటంతో నార్సింగి వద్ద ఇంటర్చేంజ్ పనులను వేగంగా పూర్తి చేసే పనిలో హెచ్ఎండీఏ అధికారులు నిమగ్నమయ్యారు.