Annapurna | సిటీబ్యూరో, మార్చి 28 (నమస్తే తెలంగాణ): ఆకలితో అలమటించే వాళ్లకు కడుపు నిండా భోజనం పెట్టాలన్న ఉద్దేశంతో శ్రీకారం చుట్టిన ‘అన్నపూర్ణ’ కేంద్రాల పట్ల జీహెచ్ఎంసీ నిర్లక్ష్యం చూపుతున్నది. పేదల పాలిట ‘అక్షయపాత్ర’గా నిలిచిన అన్నపూర్ణ పథకం అధికారుల నిర్లక్ష్యం కారణంగా నీరుగారుతున్నది. కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే దేశంలోనే అతిపెద్ద పథకంగా నిలిచిన ఈ అక్షయపాత్రపై కాంగ్రెస్ ప్రభుత్వం శీతకన్ను వేసింది. ఈ నేపథ్యంలోనే 150 డివిజన్లలో 150 కేంద్రాల ద్వారా ప్రతి రోజుకు 45 వేల మందికి భోజనాలు అందించాల్సిన అధికారులు.. 11 ప్రాంతాల్లో అన్నపూర్ణ సెంటర్లను ఎత్తివేశారు.
ప్రస్తుతం 139 కేంద్రాల ద్వారా రూ. 30వేల మందికి మాత్రమే భోజనాలు అందిస్తున్నారు. సరాసరిగా రోజుకు ఒక కేంద్రం ద్వారా 250 భోజనాలు అందిస్తుండగా.. ఏడాదికి రూ.25 కోట్ల మేర బడ్జెట్లో నిధులను కేటాయిస్తున్నారు. పేదల కడుపునింపుతున్న అన్నపూర్ణ పథకాన్ని వివిధ కారణాలు చూపుతూ.. ఎత్తివేసే పనిలో జీహెచ్ఎంసీ ఉండటంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటి వరకు ఖైరతాబాద్, సికింద్రాబాద్, చార్మినార్, శేరిలింగంపల్లి, ఎల్బీనగర్, కూకట్పల్లి జోన్ పరిధిలో 11 సెంటర్లను మూసివేయడం గమనార్హం.
హైదరాబాద్ నగరంలో అభాగ్యులు, పేదవారు, వివిధ పనుల కోసం నగరానికి వచ్చే సామాన్యుల ఆకలి తీర్చేందుకు జీహెచ్ఎంసీ అన్నపూర్ణ పథకాన్ని అమలు చేస్తున్నారు. కేసీఆర్ సంకల్పంతో 2014 సంవత్సరం నుంచి అమలవుతున్న ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతూ వచ్చింది. గత ప్రభుత్వ హయాంలోనే 10 కోట్ల 88 లక్షల మందికి పైగా భోజనం అందించి దేశంలోనే అతిపెద్ద భోజన పథకంగా నిలిచింది. ఇందుకోసం గత ప్రభుత్వం రూ. 216.01కోట్లు ఖర్చు చేసింది.
హైదరాబాద్ నగరానికి ఆయా పనులు, వివిధ వృత్తులు చేసుకునేందుకు నగరానికి వచ్చిన వారే కాకుండా విద్యార్థులు, నిరుద్యోగులకు అన్నపూర్ణ పథకం వారీ దైనందిన జీవితంలో భాగమైంది. రుచి, శుచి సమతుల పోషకాలతో ఆహారాన్ని అందిస్తుండటంతో వలస కార్మికులు, విద్యార్థులు, బ్యాచిలర్స్, చిరుద్యోగులు కడుపు నింపుకోవడంతో ఈ అన్నపూర్ణ భోజనాలకు ఆదరణ లభించింది. 32 అన్నపూర్ణ క్యాంటీన్లలో సిట్టింగ్లు ఏర్పాటు చేసి.. ప్రైవేట్ భోజనశాలలకు ఏ మాత్రం తీసిపోకుండా కేంద్రాలను మలిచారు. సకల సదుపాయాలు కల్పిస్తూ ఆకలి తీర్చడమే.. కాకుండా సంతృప్తిగా భోజనం చేశామన్న అనుభూతిని కల్పించేలా చర్యలు చేపట్టారు.
జీహెచ్ఎంసీ పరిధిలోని 18 ప్రభుత్వ పెద్ద ఆస్పత్రులకు 17 ప్రభుత్వ వైద్యశాలల్లో రూ. 5లకే అందిస్తున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక జీహెచ్ఎంసీ ఈ అన్నపూర్ణ సెంటర్ల నిర్వహణను గాలికి వదిలేసింది. ఉన్న సెంటర్లను క్రమక్రమంగా ఎత్తివేయడమే కాకుండా వినియోగంలో ఉన్న 139 కేంద్రాల్లో చాలా వరకు అపరిశుభ్ర వాతావరణంలో ఉంటున్నాయని స్థానికులు వాపోతున్నారు. సెంటర్ల పక్కనే వ్యర్థాలతో పాటు మూత్ర విసర్జనలతో దుర్వాసన వస్తుందని చెబుతున్నారు. గతంలో లాగా నాణ్యమైన భోజనం ఉండటం లేదంటున్నారు.