1971లో ప్రారంభమైన ఈ కళాశాల 50 వసంతాల్లోకి అడుగుపెట్టి స్వర్ణోత్సవ సంబురాలు చేసుకుంటున్నది. ఉస్మానియా విశ్వవిద్యాలయం పరిధిలో కొనసాగుతూ స్వయం ప్రతిపత్తి హోదాలో ప్రతిభావంతులైన విద్యార్థులను అందిస్తున్నది. ఇక్కడ 90శాతం మార్కులు సాధించిన వారికే సీటు లభిస్తుంది. ఎంపిక చేసుకున్న కోర్సుకు భిన్నంగా కాంబినేషన్ కోర్సులు ఎంచుకునే సదుపాయం ఈ విద్యాసంస్థ కల్పిస్తుంది. ఈ కళాశాలకు రెండు సార్లు ఐఎస్వో సర్టిఫికెట్ కూడా దక్కింది. 1971 నుంచి 2021నాటికి సుమారు 10 లక్షల మంది విద్యార్థులు ఇక్కడ విద్యను అభ్యసించారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఏ హానర్స్ (ఎకానిమిక్స్), బీఏ హానర్స్ (పొలిటికల్ సైన్స్) కోర్సులతో పాటు ఫిజికల్సైన్స్, బయోలాజికల్ సైన్స్లో మొత్తం 56 కాంబినేషన్ కోర్సులు అందిస్తున్నారు. 20 వరకు సర్టిఫికెట్ కోర్సులలో శిక్షణ ఇస్తున్నారు. దీని కోసం పరిశ్రమల సంస్థలతో ఒప్పందం చేసుకున్నారు. ఇందుకు అనుగుణంగా కళాశాలలో తెలంగాణ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ కేంద్రం పని చేస్తుంది. ప్రతి సంవత్సరం కళాశాలలో ఉద్యోగ మేళా నిర్వహిస్తారు. ప్రతి ఏడాది సుమారు 200మంది విద్యార్థులు వివిధ రంగాల్లో ఉద్యోగాలు సాధిస్తున్నారు. ఈ కళాశాలలో ప్రస్తుతం 3676 మంది వివిధ కోర్సులలో విద్యను అభ్యసిస్తుండగా పీజీలో 170మంది విద్యనభ్యసిస్తున్నారు. వీరికి అందరిగానూ 89 మంది మంచి నిష్ణాతులైన ప్రొఫెసర్లు విద్యను బోధిస్తున్నారు.
మహిళా సాధికారతే మా ప్రయత్నం..
విద్యార్థులను నిష్ణాతులైన సమాజోద్ధారకులుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. మహిళలు అక్షరాస్యులైతేనే సామాజిక వికాసం సాధ్యపడుతుందనే లక్ష్యంతో విద్యార్థులను తీర్చిదిద్దుతున్నాం. మా ప్రయత్నం మహిళా సాధికారతకు బాసటగా నిలుస్తుందని భావిస్తున్నాం. కళాశాల స్వర్ణోత్సవాలు వచ్చే యేడాది ఆగస్టు వరకు కొనసాగిస్తాం.
సాంస్కృతిక, సామాజిక అంశాల్లో…
సామాజిక చైతన్యం కల్పించే కార్యక్రమాలు, సాంస్కృతిక అంశాలు, క్రీడలు, ఆత్మరక్షణకు కరాటే, న్యాయ సంబంధమైన సమస్యలు చట్టాలు, నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా శిక్షణ తరగతులు ఏర్పాటు చేసి అవగాహన కల్పిస్తున్నారు. తరుణి, అన్వేషిత, అస్మిత, దిశ తదితర సంస్థల కౌన్సిలర్ల ప్రసంగాలు ఇక్కడ ఏర్పాటు చేస్తుంటారు. ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలూ జరుగుతాయి.
పురస్కారాలు, పర్యావరణ పరిరక్షణ
యువ తరంగంలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీల్లో 2017 నుంచి 2019 వరకు ఈ కళాశాల చాంపియన్షిప్ నిలబెట్టుకుంది. 2018లో సాంస్కృతిక ప్రదర్శనల్లో పతకం దక్కించుకుంది. శాస్త్రీయ నృత్యం, క్రీడల్లో విద్యార్థులు రాష్ట్రస్థాయిలో రాణించారు. ఢిల్లీలో గణతంత్య్ర దినోత్సవం పెరేడ్లో విద్యార్థులు ప్రాతినిధ్యం వహించారు. ఈ కళాశాల విద్యార్థులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ పైనా అవగాహన కార్యక్రమాలు కొనసాగిస్తూ గ్రీన్ ర్యాలీలు, మొక్కలు నాటడం, పారిశుద్ధ్య నిర్వహణ, ప్లాస్టిక్హ్రిత కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇంకుడు గుంతలు నిర్మించడంతో పాటు 800 చదరపు అడుగుల్లో సోలార్ విద్యుత్ ఉత్పత్తి కూడా చేస్తున్నారు.