Symposium | ఉస్మానియా యూనివర్సిటీ ఇంజినీరింగ్ కళాశాలలోని వివిధ విభాగాలలో వేరువేరు పేర్లతో జాతీయ స్థాయి టెక్నికల్ ఫెస్టివల్ (సింపోజియం) ప్రారంభమైంది. ఈ సింపోజియంలో భాగంగా విద్యార్థులు పలు విభాగాలలో పోటీలు నిర్వహించారు. రెండు రోజుల పాటు నిర్వహించనున్న ఈ పోటీలలో విద్యార్థులకు తమ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా పలు కళాశాలల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీంతో యూనివర్సిటీ సందడిగా మారింది. ఈ సింపోజియంలను అధ్యాపకులతో సంబంధం లేకుండా ఆయా విభాగాల విద్యార్థులే నిర్వహించారు. అధ్యాపకులు కేవలం సలహాదారులుగా వ్యవహరిస్తారని విద్యార్థులు వివరించారు. విద్యార్థుల అభిప్రాయాలు, పరిశోధనల అనుభవాలను ఒక వేదికపైకి తీసుకువచ్చేందుకు ఈ సింపోజియంలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు. టీమ్ వర్క్, ప్రణాళిక, నిధుల సేకరణ తదితర అంశాలను విద్యార్థి దశలోనే నేర్చుకోవచ్చని చెబుతున్నారు.
ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు టెక్సోనెన్స్ – 2024 పేరుతో సింపోజియం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రకాల పేర్లతో పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, నాన్ టెక్నాలజీ క్విజ్, టెక్నాలజీ క్విజ్, లైవ్ ప్రాజెక్టులు, షార్ట్ ఫిల్మ్, మేకింగ్ ఆఫ్ సర్క్యూట్, కల్చరల్ పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ టెక్సోనెన్స్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ, ఐఏఎస్ అధికారి ముషారఫ్ అలీ ఫరూఖీ హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో అమెరికాలోని కృష్ణ ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ అధినేత గోపాల్ టీకే కృష్ణ, ఓయూ యూజీసీ డీన్ ప్రొఫెసర్ మల్లేశం, హెడ్ ప్రొఫెసర్ విద్యాసాగర్, ఫ్యాకల్టీ కో ఆర్డినేటర్ ప్రొఫెసర్ మంగు, డాక్టర్ ఎస్.విజేందర్రెడ్డి, విద్యార్థి కన్వీనర్ అభినవ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మెకానికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు మెకరీనా పేరుతో సింపోజియం నిర్వహిస్తున్నారు. రోబొటిక్స్, పేపర్ ప్రజెంటేషన్, క్విజ్, లైవ్ ప్రాజెక్టులు, ైస్పాట్ ఇవెంట్స్ తదితర విభాగాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. వర్సిటీ ల్యాబ్లో ఉన్న అధునాతన యంత్రాలను విద్యార్థుల చూసేందుకు వీలుగా ప్రదర్శన ఏర్పాటు చేశారు. నిపుణులచే అతిథి ఉపన్యాసాలను ఏర్పాటు చేశారు. ఈ మెకరీనా 2024 ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా భారత్ ఫోర్జ్ లిమిటెడ్ అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్ ఫణి కౌండిన్య హాజరై ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో డిపార్ట్మెంట్ హెడ్ ప్రొఫెసర్ చంద్రశేఖర్రెడ్డి, ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ టి. నాగవేణి, స్టూడెంట్ కన్వీనర్ అనురాగ్, కోకన్వీనర్లు శశాంక్రెడ్డి పాల్గొన్నారు.
మైనింగ్ ఇంజినీరింగ్ విభాగంలో ఇగ్నైట్ పేరుతో విద్యార్థులు సింపోజియం నిర్వహించారు. ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మైన్స్ అండ్ జియాలజీ డైరెక్టర్ బీఆర్వీ సుశీల్కుమార్ హాజరై ప్రసంగించారు. సింపోజియంలో భాగంగా మైన్స్ క్విజ్, మైన్ మోడల్ ప్రజెంటేషన్, డిబేట్, వర్క్షాప్స్, మైన్ ఎన్విరాన్మెంటల్ ఎక్విప్మెంట్ ప్రజెంటేషన్ తదితర అంశాలలో పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎన్ఐటీ రూర్కెలా ప్రొఫెసర్ హిమాన్షు భూషణ్ సాహూ, వెన్సర్ కన్స్ట్రక్షన్ కంపెనీ లిమిటెడ్ అడ్వైజర్ ఎంఎస్ వెంకట్రామయ్య, మినిస్ట్రీ ఆఫ్ కోల్ మాజీ అడ్వైజర్ డీఎన్ ప్రసాద్, రిటైర్డ్ ప్రొఫెసర్ శ్రీనివాస్, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, ఫ్యాకల్టీ అడ్వైజర్ ఎం.సతీశ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.
సివిల్ ఇంజినీరింగ్ విద్యార్థులు నిర్మాణ్ పేరుతో సింపోజియం ఏర్పాటు చేసి విద్యార్థుల ప్రతిభను వెలికితీశారు. విద్యార్థులు రూపొందించిన అధునాతన మూసీ నమూనాను ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. పేపర్ ప్రజెంటేషన్, టెక్నో జనరల్ క్విజ్, క్యాడ్మానియా, ట్రెజర్హంట్, సేజ్ ఆన్ స్టేజ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఓయూ వీసీ ప్రొఫెసర్ రవీందర్, కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, హెడ్ ప్రొఫెసర్ రాజశేఖర్, స్టూడెంట్ కన్వీనర్ శ్రీనాథ్, తదితరులు పాల్గొన్నారు.
సింపోజియం ‘ఆకృతి’లో భాగంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన ప్రదర్శన ఎంతగానో ఆకట్టుకుంది. ఈ ప్రదర్శనలో భాగంగా టెలిఫోన్, క్యాలిక్యులేటర్, అనలాగ్ కంప్యూటర్, కెమెరా, టీవీ, టైప్రైటర్, రేడియో తదితర వస్తువుల మొదటి తరం నమూనాలను ప్రదర్శించారు. ‘చంద్రయాన్’ అనే థీమ్తో నమూనా రూపొందించారు. ఇందులో భాగంగా పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, బిజినెస్ క్విజ్, ప్రోగ్రామింగ్ క్విజ్, రొబోటిక్స్, టెక్నాలజీ క్విజ్, షార్ట్ ఫిల్మ్ మేకింగ్ తదితర అంశాలలో పోటీలు నిర్వహిస్తున్నారు. ఈ సింపోజియం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా డీఆర్డీవో ఆర్సీఐ ఔట్ స్టాండింగ్ సైంటిస్ట్ జాగీర్ధార్ హాజరై ప్రసంగించారు. ఓటములను తట్టుకుని, లక్ష్యాన్ని మనసులో పెట్టుకుని కష్టపడితే గమ్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ చంద్రశేఖర్, హెడ్ ప్రొఫెసర్ రామకృష్ణ, ఫ్యాకల్టీ అడ్వైజర్ డాక్టర్ శ్యాంసుందర్, స్టూడెంట్ కన్వీనర్ సాయిచంద్ర, కోకన్వీనర్లు రాకేశ్, నిఖిల్నాయక్, శ్రీద్యుతి, శిశిర తదితరులు పాల్గొన్నారు.
బయోమెడికల్ ఇంజినీరింగ్ విద్యార్థులు మెడిటెక్ 2024 పేరుతో సింపోజియం నిర్వహిస్తున్నారు. ఈ సింపోజియం ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా ఐఏఎస్ అధికారి, హెల్త్, ఫ్యామిలీ వెల్ఫేర్ కమిషనర్ ఆర్వీ కర్ణన్ హాజరై ప్రసంగించారు. విద్యార్థులకు పేపర్ ప్రజెంటేషన్, క్విజ్, స్పాట్ ఈవెంట్స్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. అధునాతన వైద్య పరికరాలను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో మెడిసిన్ మెడికల్ ప్రోడక్ట్స్ సీఈవో ఖుస్రూవకీల్, విభాగం హెడ్ ప్రొఫెసర్ మాలిని, డాక్టర్ సుమన్రెడ్డి, డాక్టర్ విద్యాసాగర్, డాక్టర్ హరీశ్ తదితరులు పాల్గొన్నారు.
కంప్యూటర్ సైన్స్ విభాగంలో ఇన్ఫినిటీ పేరుతో విద్యార్థులు సింపోజియం నిర్వహించారు. ఇందులో భాగంగా విద్యార్థులు టెక్నాలజీ ఈవెంట్, పేపర్ ప్రజెంటేషన్, పోస్టర్ ప్రజెంటేషన్, మూవీ క్విజ్, స్పాట్ ఈవెంట్స్, పన్నెండు గంటల కంప్యూటర్ కోడింగ్ తదితర పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర ప్రభుత్వ ఐటీఈఅండ్సీ విభాగం ఎమర్జింగ్ టెక్నాలజీస్ డైరెక్టర్ రమాదేవి లంక, యువర్ వోల్టా సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్ శశికాంత్ కనపర్తి, హెడ్ ప్రొఫెసర్ పీవీ సుధ, ఫ్యాకల్టీ కన్వీనర్ డాక్టర్ గోవర్ధన్రావు, స్టూడెంట్ కన్వీనర్ సుజీత్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.