సిటీబ్యూరో, జనవరి 13 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీయువకులకు సివిల్ సర్వీసెస్తో పాటు గ్రూప్-1, గ్రూప్-2 వంటి అనేక పోటీ పరీక్షలకు శిక్షణ ఇవ్వడం కోసం.. కేసీఆర్ ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన ఉచిత సివిల్ సర్వీసెస్ అకాడమీ స్ఫూర్తికి ఓయూ అధికారులు తూట్లు పొడుస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా అందుబాటులోకి తీసుకొచ్చిన సివిల్ సర్వీసెస్ ఉచిత అకాడమీ ద్వారా ఒకే సారి 1000 మందికి శిక్షణ ఇవ్వాల్సిన అధికారులు.. 100 మంది నిరుద్యోగ యువతకే పరిమితం చేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా అర్హులైన యువతి, యువకులందరిని ఎంపిక చేసి శిక్షణ ఇవ్వడం కోసం ఓయూలోనే ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ ఉచిత అకాడమీని ఏర్పాటు చేసి రెండేండ్లు పూర్తయినప్పటికీ.. వంద మందికి మాత్రమే శిక్షణ ఇవ్వడానికి ఓయూ అధికారులు ముందుకు రావడంపై నిరుద్యోగలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పైగా గ్రూప్-1, గ్రూప్-2, డీఎస్సీ, కానిస్టేబుల్ వంటి పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి కూడా ఉచిత శిక్షణ ఇస్తామని గతంలో ఓయూ ఉన్నతాధికారులు యువతకు హామీ ఇచ్చారు.
కాని, కొత్తగా అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వంలో సివిల్ సర్వీసెస్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు మాత్రమే శిక్షణ ఇస్తామని నిరుద్యోగ అభ్యర్థులను ఎంపిక చేసినట్లు సివిల్ సర్వీసెస్ అకాడమీ ఇన్చార్జి చెబుతున్నారు. ఆ వంద మంది నిరుద్యోగ యువత కూడా ఓయూ క్యాంపస్లో వివిధ కోర్సులు చదువుతున్న వారై ఉండాలి అన్న ఆంక్షలు విధించారు. రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీల పరిధిలో ఉన్న యువతకు ఇక్కడ శిక్షణ ఇవ్వడం లేదని, ఈ మేరకు ఇంత వరకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ఉచిత శిక్షణకు ఎంపిక చేసిన వంద మంది నిరుద్యోగ అభ్యర్థుల వివరాలు ఓయూ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచినట్లు యూనివర్సిటీ ప్రొఫెసర్ గడ్డం నాగేశ్వర్రావు తెలిపారు. దీంతో నిరుద్యోగ యువత తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకుని నిరుద్యోగ యువతకు పెద్ద సంఖ్యలో ఉచిత శిక్షణ ఇవ్వడానికి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.