ఉస్మానియా యూనివర్సిటీ, జూలై 3: అగ్నిపథ్ నిరసనల సందర్భంగా అరెస్టయిన యువకులను బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో విద్యార్థులు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. ఉస్మానియా ఆర్ట్స్ కళాశాల ఆవరణలో జరిగిన ఈ నిరసనలో టీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వలన దేశానికి నష్టం జరుగుతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. మోదీ నిజంగా దేశభక్తుడైతే అగ్నిపథ్లాంటి తప్పుడు నిర్ణయాలు తీసుకోరని అన్నారు.
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నిరసన సందర్భంగా పోలీసులు అరెస్టు చేసిన ఆర్మీ రిక్రూట్మెంట్ అభ్యర్థులను బేషరతుగా విడుదల చేయాలని, వారిపై పెట్టిన కేసులనూ ఉపసంహరించుకోవాలని గెల్లు శ్రీనివాస్ డిమా ండ్ చేశారు. 2019, 2020 సంవత్సరాల్లో జరిగిన ఆర్మీ రిక్రూట్మెంట్ ర్యాలీలో పాల్గొన్న అభ్యర్థులందరికీ రాత పరీక్ష నిర్వహించి సైన్యంలో చేర్చుకోవాలన్నారు. అనంతరం జింఖానా మైదానంలో జరుగుతున్న ప్రధాని మోదీ బహిరంగ సభను ముట్టడించేందుకు విద్యార్థి నా యకులు ర్యాలీగా బయల్దేరారు. కాగా, పోలీసులు వారి ని అదుపులోకి తీసుకుని ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్వీ నాయకులు రఘురాం, కడారి స్వామి, కోతి విజయ్, శ్రీకుమార్, దశరథ్, జంగయ్య, వేల్పుకొండ వెంకటేశ్ తదితరులతోపాటు పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.