సిటీబ్యూరో, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): ‘మీరూ భారత పార్లమెంట్ సభ్యులు కావొచ్చు.. పార్లమెంట్లో మీ వాగ్ధాటితో దేశం మొత్తాన్ని ఆకర్షించవచ్చు.. అందుకు సిటిజన్ యూత్ పార్లమెంట్’ వేదికవుతున్నది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి సారిగా ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా ‘సిటిజన్ యూత్ పార్లమెంట్’ సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ సౌజన్యంతో సిటిజన్ ఇండియా సంస్థ నిర్వహిస్తున్న సిటిజన్ యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొన్న యువత పార్లమెంట్లో మాదిరిగానే ప్రజా సమస్యలపై దేశం మొత్తాన్ని ఆకర్షించే విధంగా చర్చించే అరుదైన అవకాశం కల్పించనున్నారు. ఇందులో దేశానికి సంబంధించిన అభివృద్ధి అంశాలు మొదలు సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యా, వైద్యం, సంక్షేమం వంటి అన్ని రంగాలపై సుదీర్ఘంగా చర్చించే అవకాశం కల్పిస్తున్నారు. ఉస్మానియా యూనివర్సిటీలోని టాగోర్ ఆడిటోరియంలో నిర్వహించనున్న ఈ సమావేశంలో 18 నుంచి 40 సంవత్సరాలు ఉన్న స్త్రీ, పురుషులు ఎవరైనా పాల్గొనే అవకాశం ఉన్నదని సిటిజన్ ఇండియా సీఈవో స్వాతిచంద్రశేఖర్ తెలిపారు. యువతతో పాటు నిష్ణాతులు, ప్రొఫెసర్లు, రాజకీయ నాయకులు పాల్గొంటారని చెప్పారు.
అక్టోబర్ 8 నుంచి మొదలు
అక్టోబర్ 8, 9, 10 తేదీలలో నిర్వహించనున్న యూత్ పార్లమెంట్ సమావేశాల్లో మూడు అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. వాటిలో తెలంగాణ అంశాన్ని ప్రధానంగా ఎంపిక చేశారు. తెలంగాణ రాష్ట్రం రాకముందు, వచ్చిన తర్వాత అభివృద్ధి ఎలా జరిగింది.? వ్యవసాయం ఎలా బాగుపడింది.? రైతుల కోసం అమలు పరుస్తున్న రైతుబంధు పథకం ఎలా అమలవుతుంది..? ఈ పథకం వల్ల రైతులకు కలుగుతున్న లాభాలు? వంటి అంశాలై ప్రత్యేకంగా చర్చించనున్నారు. అన్ని రంగాల్లో తెలంగాణ రాష్ట్రం దేశానికి ఆదర్శంగా ఎలా నిలువగలిగింది అనేదానిపై చర్చించనున్నారు. యూత్ పార్లమెంట్లో రాష్ట్రంలోని ఓయూ, కాకతీయ, శాతవాహన, జేఎన్టీయూ తదితర యూనివర్సిటీల నుంచి అనేక మంది విద్యార్థులు హాజరుకానున్నారు.
వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీవేదికగా..
రాష్ర్టాల వారీగా నిర్వహించనున్న యూత్ పార్లమెంట్ వేదికల ద్వారా దేశ వ్యాప్తంగా మొత్తం 543 మందిని వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీవేదికగా నిర్వహించనున్న నేషనల్ లెవల్ యూత్ పార్లమెంట్లో పాల్గొనడానికి అవకాశం కల్పిస్తున్నారు. అంటే ప్రస్తుతం భారత పార్లమెంట్లో ఎంత మంది ఎంపీ సభ్యులు ఉన్నారో.. ఆ సంఖ్య ప్రకారమే ఇక్కడ అభ్యర్థులను ఎంపిక చేసే కార్యక్రమం కొనసాగుతున్నది. అందులో భాగంగా తెలంగాణ నుంచి 17మంది, ఏపీ నుంచి 25 మంది, ఈ విధంగా రాష్ర్టాల వారీగా యూత్ పార్లమెంట్ సభ్యులను ఎంపిక చేయనున్నారు. ఈ సమావేశాల్లో పాల్గొనడానికి ఆసక్తి ఉన్న యువత, విద్యార్థులు అక్టోబర్ 4వ తేదీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ కోసం http://forms.gle/3rshpgfR5fe4ACUa9 పోర్టల్ను సంప్రదించాలని నిర్వాహకులు తెలిపారు. పూర్తి వివరాల కోసం 9319256888 నంబర్కు సంప్రదించాలన్నారు.