సుల్తాన్ బజార్ జూలై 18.ప్రాణాపాయ స్థితిలో ఉస్మానియా దవాఖానలో చేరిన ఓ యువతికి ఉస్మానియా దవాఖాన వైద్యులు పునర్జన్మను ప్రసాదించారు. రెండు నెలల క్రితం ప్రాణాపాయ స్థితిలో కోమాలో ఉన్న ఓ యువతి, ప్రస్తుతం బీటెక్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు హాజరవుతోంది. ఆమెకు ఉస్మానియా వైద్యులు కాలేయ మార్పిడి చేసి పునర్జన్మను ప్రసాదించా రు. జూబ్లీహిల్స్లో తల్లితో పాటు నివాసం ఉంటున్న 17 ఏళ్ల వయసున్న బ్లెస్సీ గౌడ్ ఈ ఏడాది మే నెలలో జ్వరం బారిన పడింది. తల్లి ఆమెను ప్రైవేటు హాస్పిటల్లో అడ్మిట్ చేసింది. 5 రోజుల తర్వాత ఆమె కోమాలోకి వెళ్లింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న ఆమెను మే 12వ తేదీన కుటుంబ సభ్యులు ఉస్మానియా దవాఖానలో చేర్పించారు.
బ్లెస్సీని పరీక్షించిన ఉస్మానియా వైద్యులు, ఆమె లివర్ పూర్తిగా పాడైపోయిందని (అక్యూట్ ఫుల్మీనంట్ లివర్ ఫెయిల్యూర్) గా గుర్తించారు. 48 గంటల లోపల ఆమెకు కాలేయ మార్పిడి చేస్తేనే బతుకుతుందని, లేదంటే ఆమె చనిపోయే ప్రమాదం ఉందని కుటుంబ సభ్యులకు వివరించారు. కాలేయ దానానికి ఆమె తల్లి, కుటుంబ సభ్యులు ముందుకొచ్చారు. వారిని పరీక్షించిన వైద్యులు, బ్లెస్సీకి వారి కాలేయం సరిపోలడం లేదని తేల్చారు.
బ్లెస్సీ పరిస్థితిని వివరిస్తూ కాలేయం కోసం జీవన్దాన్ సూపర్ అర్జం ట్ కేటగిరీలో దాత కోసం రిజిస్టర్ చేశారు. జీవన్దాన్ సూపర్ అర్జంట్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఎక్స్పర్ట్ టీమ్ ఈ వినతిని పరిశీలించి కాలేయం ఇవ్వడానికి గ్రీన్ సిగ్నల్ ఇ చ్చింది. అదే సమయంలో ఓ ప్రైవేటు హాస్పిటల్లో బ్లెస్సీ బ్లడ్ గ్రూప్నకు మ్యాచ్ అయ్యే వ్యక్తి బ్రెయిన్ డెత్ అయ్యారు. ఆ వ్యక్తి లివర్ను, బ్లెస్సీ కోసం జీవన్దాన్ కేటాయించింది. మే 12వ తేదీన బ్లెస్సీ ఉస్మానియా లో చేరగా, మే 14న ఉస్మానియా సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగాధిపతి డాక్టర్ మధుసూదన్ నేతృత్వంలోని వైద్యుల బృందం ఆమెకు కాలేయ మార్పిడి చేసింది. రెండు వారాల తర్వాత బ్లెస్సీని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేశారు. ప్రస్తుతం ఆమె పూర్తిగా కోలుకుని, ఫస్ట్ ఇయర్ బీటెక్ ఎగ్జామ్స్కు హాజరవుతున్నది.
సర్జికల్ గ్యాస్ట్రోఎంటరాలజీ విభాగం హెచ్వోడీ మధుసూధన్ శుక్రవారం ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు. దేశంలో సూపర్ అర్జెంట్ కేటగిరీలో ప్రభుత్వ హాస్పిటల్లో కాలేయ మార్పిడి జరగడం ఇదే తొలిసారి అని ఆయన తెలిపారు. ఉస్మానియా వైద్యులు, జీవన్దాన్ బృందం వేగంగా స్పందించడంతో పాటు, బ్లెస్సీ అదృష్టంకొద్దీ సకాలంలో ఆమెకు మ్యాచ్ అయ్యే కాలేయం దొరికిందని వెల్లడించారు. బ్లెస్సీకి పూర్తి ఉచితంగా కాలేయ మార్పిడి చేశామని తెలిపారు. ఉస్మానియా డాక్టర్ల బృందాన్ని మంత్రి దామోదర రాజనర్సింహ అభినందించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లతో సమానంగా ప్రభుత్వ దవాఖానలలో వైద్య సేవలు అందిస్తున్నామని లిపారు.